కంగనా గాలి తీసేసిన సుశాంత్ లాయర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి నుంచి బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న వాయిస్ కంగనా రనౌత్‌దే. బాలీవుడ్ మాఫియా సుశాంత్‌ను తొక్కేసిందని.. నెపోటిజం బ్యాచ్, వాళ్లను ప్రోత్సహించే కరణ్ జోహార్ లాంటి వాళ్ల వల్ల సుశాంత్‌ కుంగిపోయాడని.. అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది వాళ్లేనని ఆమె ఆరోపణలు చేసింది.

గత రెండు నెలల్లో ఇలా ఎన్నిసార్లు ఆరోపించిందో.. ఎన్ని వీడియో సందేశాలు పెట్టిందో లెక్కలేదు. కంగనాను అభిమానించే నసీరుద్దీన్ షా లాంటి వాళ్లు సైతం ఆమె తీరును ఖండించారు. సుశాంత్ మృతిని కంగనా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని విమర్శలు చేసిన వాళ్లూ లేకపోలేదు. ఐతే వాళ్లంతా అనడం వేరే కానీ.. స్వయంగా ఇప్పుడు సుశాంత్ కుటుంబ సభ్యులు పెట్టుకున్న లాయర్ వివేక్ సింగ్ కంగనా మీద ఇదే తరహా విమర్శలు చేశాడు.

సుశాంత్ మృతి విషయంలో అతడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నది తన ప్రేయసి రియా చక్రవర్తి మీదే. ఆమెతో పాటు మరో ఇద్దరి మీద సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులోనూ పిటిషన్ వేశాడు. ఈ కేసును సుశాంత్ కుటుంబ సభ్యుల తరఫున వాదిస్తున్న వివేక్ సింగ్.. సుశాంత్ మృతికి, బాలీవుడ్లో నెపోటిజానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు.

ఈ విషయంలో తాము బాలీవుడ్లో ఎవ్వరి మీదా ఆరోపణలు చేయదలుచుకోలేదన్నాడు. సుశాంత్ కొంత మేర నెపోటిజం వల్ల ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అని.. కానీ అతడి మృతికి అది కారణం కాదని అతనన్నాడు. కంగనా రనౌత్ ఆరోపణల గురించి అడిగితే.. ఆమె వ్యక్తిగత అజెండాతో వెళ్తోందని.. తాను లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తుల్ని ఇరుకున పెట్టడం కోసం సుశాంత్ మృతిని వాడుకుంటోందని తేల్చేశాడు వివేక్. సుశాంత్ మృతికి రియానే కారణమని, అదే తమ ప్రధాన అభియోగమని అతనన్నాడు.