చిరుతో సందీప్ వంగా ఛాన్సే లేదు

డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తప్ప ఇంకో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని యానిమల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి దాన్ని రన్బీర్ కపూర్ తో తెరకెక్కించి డిసెంబర్ 1 విడుదల చేయించే పనిలో ఉన్నాడు. స్వతహాగా ఇతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. చిరంజీవిని సైతం అంతే మోతాదులో విపరీతంగా ఇష్టపడతాడు. పలు ఇంటర్వ్యూలలో, ఇతని పాత ట్వీట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీళిద్దరిలో కనీసం ఒకరితో అయినా సందీప్ కాంబో పడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

గత రెండు రోజులుగా కొందరు చిరు సందీప్ కలయికలో ఒక ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందని ఆ వార్తని వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవిక కోణంలో చూస్తే దానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యానిమల్ రిలీజ్ అయ్యాక జనవరి నుంచి సందీప్ వంగా ఫ్రీ అవుతాడు. ప్రభాస్ స్పిరిట్ ని 2024 జూన్ నుంచి మొదలుపెట్టే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఆలోగా స్క్రిప్ట్ ని లాక్ చేసుకుని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకోవాలి. వేగంగా తీసే అలవాటు లేదు కాబట్టి ఎంతలేదన్నా 2025 కంటే ముందే పూర్తవ్వడం అసాధ్యం. ఆపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పనులు మొదలుపెట్టాలి.

దీనికో రెండేళ్లు వేసుకున్నా 2027 వచ్చేస్తుంది. ఇంకో ఏడాది ఎక్స్ ట్రా పట్టినా ఆశ్చర్యం లేదు. పైగా మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనే ప్లాన్ తో ఎప్పటి నుంచో తనతో టచ్ లో ఉన్నాడు సందీప్ వంగా. స్టోరీ రెడీ అయితే రాజమౌళి తర్వాత ఈ కాంబో సాధ్యపడొచ్చు. ఇంతా జరిగి 2030 దాటిపోతుంది. చిరంజీవి ఆలోగా సులభంగా ఆరేడు సినిమాలు చేసేస్తారు. పవన్ రాజకీయాల మీద ఆయన కమిట్మెంట్లు ఆధారపడి ఉంటాయి. సో ఏ కోణంలో చూసిన మెగాస్టార్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ చేతులు కలపడం దరిదాపుల్లో లేదు. ఊహించుకోవడానికి కొన్ని బాగుంటాయి కానీ అవి అమలులోకి రాలేవు.