నాలుగు నెలలకు ఓటిటి మోక్షం

హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఇమేజ్ ఉన్న హీరో సినిమా థియేటర్లలో ఆడకపోతే దాన్ని ఓటిటిలో ఓసారి చూద్దామనుకునే ప్రేక్షకులు భారీగా ఉంటారు. మరీ బోర్ కొడితే ఎలాగూ ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కనక పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని మాత్రం ఎంత ఎదురు చూసినా రాకుండా భలే పరీక్ష పెడతాయి. అఖిల్ ఏజెంట్ ఇప్పటిదాకా రాని సంగతి తెలిసిందే. ఇదే కోవలో గోపీచంద్ రామబాణం కూడా వెయిటింగ్ లిస్టులో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో మే నెలలో రిలీజయ్యింది.

కట్ చేస్తే నాలుగు నెలల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సదరు యాప్ లో అఫీషియల్ నోటిఫికేషన్ పెట్టారు. అయితే ఇంత ఆలస్యం ఎందుకయ్యిందనే డౌట్ రావొచ్చుగా. దానికి లాజిక్ ఉంది. విడుదలకు ముందు రామబాణం డిజిటల్ రైట్స్ కి ఎక్కువ మొత్తం వస్తుందని ఆశించారట. తీరా ఫలితం చూశాక ఓటిటి కంపెనీలు వెనుకడుగు వేశాయి. ప్రైమ్ లాంటివి థర్డ్ పార్టీ ద్వారా ఓకే అంటాయి కానీ దీని వల్ల వచ్చే ఆదాయం తక్కువ. అలా రామబాణం అమ్ములపొదిలోనే ఉండిపోయింది. ఇప్పుడు మోక్షం కలగడం వెనుక బ్రో ఉందని ఇన్ సైడ్ టాక్.

పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి ఇదే పీపుల్స్ సంస్థ నిర్మించిన బ్రోని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. పనిలో పనిగా రామబాణం కూడా రీజనబుల్ డీల్ చేసుకున్నారు. మాములుగా ఈ ఓటిటి నేరుగా కొనడమే తప్ప వ్యూస్ ని బట్టి ఆదాయాన్ని పంచుకోవడం లాంటి ఆప్షన్లు ఇవ్వదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే దానికి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి. రామబాణంకు అలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పనైపోయినట్టుంది. శాటిలైట్ ఛానల్స్ సినిమాలు కొనడం తగ్గించిన ట్రెండ్ లో ఓటిటిలు సైతం ఆచితూచి అడుగులు వేయడం ఆందోళన కలిగించే విషయమే.