శెట్టి జోడి ఇంకొంచెం ఆగి ఉంటే

జవాన్ ప్రభంజనంలోనూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆశించిన దానికన్నా మెరుగ్గా వసూళ్లు రాబట్టడం ట్రేడ్ ని సంతోషంలో ముంచెంత్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్, నైజామ్ కలెక్షన్లు చాలా బాగున్నాయి. మాస్ సెంటర్స్ లో షారుఖ్ ఖాన్ ఆధిపత్యం వల్ల కొంత వెనుకబడి ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్సే లేని ఇలాంటి జానర్ తో ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. నవీన్ పోలిశెట్టి హ్యూమర్, అనుష్క కంబ్యాక్ కోసం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తున్నారు. మల్టీ ప్లెక్సుల ఆక్యుపెన్సీలు మార్నింగ్, మ్యాట్నీలకు సైతం బాగుండటం శుభ సంకేతంగా చెప్పుకోవాలి.

అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవముంది. ఒకవేళ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కనక కొంచెం ఆగి జవాన్ ని తక్కువంచనా వేయకుండా ముందో వెనకో రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే ఫిగర్స్ ఇంకా భారీగా ఉండేవి. సెప్టెంబర్ 15 వినాయక చవితి పండక్కు డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇది కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుంది కాదు. చంద్రముఖి 2 ఆల్రెడీ తప్పుకుంది. స్కంద నెలాఖరుకు వెళ్ళింది. సో ఫెస్టివల్ స్లాట్ ఊరికే వృధా అయిపోయింది. ఆపై వారం కూడా చెప్పుకోదగ్గ విడుదల ఏదీ లేదు. సో శెట్టి జోడికి భలే ఛాన్స్ దక్కేది.

ఇలా కాకుండా సెప్టెంబర్ 1న నేరుగా ఖుషితో క్లాష్ అయినా పోలిశెట్టి డామినేట్ చేసేదన్న కామెంట్ లోనూ నిజం లేకపోలేదు. జవాన్ ని కేవలం ఒక బాలీవుడ్ మూవీగా చూడటం వల్ల వచ్చిన ఇబ్బందిది. నవీన్ అనుష్క జంటను జనం బాగా రిసీవ్ చేసుకున్నారన్న విషయం వసూళ్లు చూస్తే అర్థమైపోయింది కాబట్టి పరిస్థితులను అవగాహన చేసుకోవడంలో వచ్చిన లోపం వల్ల ఎంతలేదన్నా ఓ పాతిక ఎం ముప్పై శాతం తక్కువ ఫిగర్లతోనే సర్దుకోవాల్సి వచ్చింది. నిన్నటి నుంచి జవాన్ కు స్క్రీన్లు పెరిగాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి డిమాండ్ ఉన్నా పూర్తిగా సర్దలేని పరిస్థితి. ఆచితూచి అడుగులు అవసరమన్నది అందుకే మరి.