ప్రేక్షకులందు తెలుగు ఆడియన్స్ వేరయా

పైన పెట్టిన హెడ్డింగుకి విశ్వదాభిరామ వినురవేమా అని తగిలించుకుంటే సరిపోతుంది. సినిమా ప్రేమ విషయంలో మన ప్రేక్షకులకు ఎవరూ సాటిరారని పదే పదే ఋజువవుతూనే ఉంది. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఏ భాష నుంచి నచ్చే కంటెంట్ వచ్చినా చాలు నెత్తిన బెట్టుకుని మరీ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇది మరింత పెరిగింది. కాంతార, కెజిఎఫ్, 777 ఛార్లీ, విక్రమ్, జైలర్, జవాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు వస్తుంది. ఇవన్నీ కలిపితే కేవలం రెండేళ్లలో ఎంత లేదన్నా ఆరేడు వందల కోట్ల గ్రాస్ మనవైపు నుంచి కట్టబెట్టాం.

ఇది ఇప్పటి ట్రెండ్ కాదు. ముందు నుంచీ మన సినిమా ప్రేమ ఇంతే. మణిరత్నం, శంకర్, భారతీరాజా లాంటి లెజెండరీ దర్శకుల చిత్రాలకు ఒరిజినల్ భాషకంటే మనదగ్గరే ఎక్కువగా ఆడిన దాఖలాలు చాలా ఉన్నాయి. 80వ దశకంలోనే ప్రేమ సాగరం సిల్వర్ జూబ్లీ ఆడటం అప్పట్లో గొప్పగా చెప్పుకున్న రికార్డు. అపరిచితుడు, భారతీయుడుకి ఏపీ తెలంగాణలో శతదినోత్సవ కేంద్రాలున్నాయి. బాయ్స్ నిజానికి ఫ్లాప్ అయితే మన దగ్గర నిర్మాత మాత్రం నిక్షేపంగా సేఫ్ అయ్యాడు. అంతెందుకు రఘువరన్ బిటెక్ రీరిలీజ్ సైతం ఎగబడి చూశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి.

ఎలా చూసుకున్నా తెలుగోడి సినిమా పిచ్చి ముందు ఎవరూ ఆనరనేది చరిత్ర చాలా సార్లు రుజువు చేస్తూ వస్తోంది. వచ్చే నెల విడుదల కాబోయే లియోకి 21 కోట్లు హక్కుల కోసమే పెట్టారంటే అది కేవలం టాలీవుడ్ పబ్లిక్ మీదున్న నమ్మకమే. కర్ణాటక మినహాయించి మన తెలుగు సినిమాలు తమిళనాడు, కేరళలో ఆడిన దాఖలాలు పెద్దగా లేవు. దాన్ని ప్రాంతీయాభిమానమని కూడా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అనువాద హక్కుల రేట్లు అంతకంతా పెరుగుతూ పోవడం మాత్రం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మనవి ఎంత పెద్ద హిట్టయినా కోలీవుడ్ ప్రొడ్యూసర్లు రైట్స్ కోసం హైదరాబాద్ రావడం వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు.