బాలయ్య నిప్పురవ్వే అక్షయ్ రాణిగంజ్

బయోపిక్కులు ఎంచుకోవడంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తర్వాతే ఎవరైనా. ఇప్పటిదాకా ఎన్ని చేశారో లెక్క బెట్టడం కష్టం. సూర్య ఆకాశం నీ హద్దురాని సైతం వదలకుండా అదే దర్శకురాలితో తెరకెక్కించడం ఆయనకే చెల్లింది. తాజాగా మిషన్ రాణిగంజ్ పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది 1989లో జరిగిన నిజ జీవిత ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కింది. గతంలో అక్కికి రుస్తుం రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు టిను సురేష్ దేశాయ్ దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 6న థియేటర్లలో రానుంది.

దీనికి బాలయ్య సినిమాకు కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్ అక్కడికే వద్దాం. 1993లో నిప్పురవ్వ వచ్చింది. విజయశాంతి నిర్మాణ భాగస్వామి కం హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఏళ్ళ తరబడి నిర్మాణం జరుపుకుని బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు విడుదలయ్యింది. రాణి గంజ్ బొగ్గు గనుల్లో జరిగిన విషాదాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని తెలంగాణ సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్ కు మార్చి నిప్పురవ్వకు కమర్షియల్ హంగులు జోడించారు. తీవ్రమైన జాప్యంతో పాటు అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినా స్టాండర్డ్స్ పరంగా విమర్శకుల మెప్పు పొందింది.

అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో వందలాది కార్మికులు తవ్వకాల్లో ఉండగా హఠాత్తుగా నీరొచ్చి మైన్ ని ముంచేస్తుంది. వాళ్ళను బాలకృష్ణ కాపాడే ఎపిసోడ్ చాలా కష్టపడి తీశారు. ఇప్పుడు దాన్నే పూర్తి స్థాయి రియల్ ఇన్సి డెంట్ గా మార్చి వాస్తవికతకు మరింత దగ్గరగా తీశారు. ఒకే కథ కాకపోయినా బ్యాక్ డ్రాప్ పరంగా సారూప్యతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అప్పటి ప్రమాదంలో 220 కార్మికులు పని చేస్తున్న సమయంలో ఆరుగురు చనిపోగా 68 మందిని రక్షించి బయటికి తీసుకొచ్చారు. అదే రాణిగంజ్ అసలు నేపథ్యం.