నాగ్ సరసన పడుచు భామలు

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత నాగ్‌కు సరైన విజయమే లేదు. అందులోనూ గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాలైతే మరీ నిరాశపరిచాయి. ‘ది ఘోస్ట్’ రిజల్ట్ చూశాక తన మార్కెట్ బాగా దెబ్బ తినేసిందని అర్థం చేసుకున్న నాగ్.. తర్వాతి సినిమాను ఎంచుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు.

ఓ మలయళ సినిమాకు మాస్ టచ్ ఇస్తూ ‘నా సామి రంగా’ పేరుతో కొత్త చిత్రం చేయడానికి నాగ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా గత నెల చివర్లో దీని టీజర్ కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ టీజర్ చూసి సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయిందనుకుంటే పొరపాటే. కేవలం అనౌన్స్‌మెంట్ కోసం ప్రత్యేకంగా షూట్ చేసిన టీజర్ అది.

‘నా సామి రంగా’ రెగ్యులర్ షూట్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందుకు కొందరి పేర్లు పరిశీలించి.. చివరగా ఇద్దరిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరికీ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’తో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ భామ ఆషికా రంగనాథ్.. నాగ్ సరసన ఒక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. మరో పాత్రకు మాజీ మిస్ ఇండియా మానస వారణాసిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఆమెకు కూడా లుక్ టెస్ట్ పూర్తయింది.

వీళ్లిద్దరూ కూడా నాగ్‌తో పోలిస్తే చాలా చిన్న వాళ్లు. ఆయన పక్కన మరీ చిన్నగా అనిపిస్తారేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కాకపోతే 60 ప్లస్‌లోనూ మంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి నాగ్ పక్కన మరీ ఆడ్‌గా అనిపించకపోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో హీరో ఫ్రెండుగా ఓ కీలక పాత్ర ఉంది. దాని కోసం సీనియర్ నటులు కొందరిని పరిశీలిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే.