మోక్షజ్ఞ ఎంట్రీకి సంకేతాలు ఇస్తున్నారు

నందమూరి అభిమానులు ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉన్న మోక్షజ్ఞ ఎంట్రీ హఠాత్తుగా కాకపోయినా అతి త్వరలో ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్, సితార నాగ వంశీ లాంటి బడా నిర్మాత ఫోటో ట్వీట్ చేసి మరీ విష్ చేశారంటే ఊరికే అయ్యుండదు. ఎందుకంటే గత కొన్నేళ్లలో అదే పనిగా బాలయ్య వారసుడికి సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు ఎప్పుడూ చెప్పలేదు. ఆ అబ్బాయి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఒక కారణం.

కానీ ఇప్పుడలా కాదు. భగవంత్ కేసరి సెట్ కి వచ్చి అనిల్ రావిపూడి, శ్రీలీలతో ముచ్చటించాడు. ఫంక్షన్లకు వచ్చినప్పుడు మొహమాటం లేకుండా స్టిల్స్ ఇస్తున్నాడు. ఫ్యాన్స్ ఎవరైనా వస్తే మాట్లాడుతున్నాడు. ఎలా తెరంగేట్రం చేయించాలనే దాని మీద బాలయ్య మనసులో ఏముందో బయటికి రావడం లేదు. కొడుకు కోసం తన దగ్గరకు వస్తున్న సన్నిహితమైన నిర్మాణ సంస్థలకు, ప్రొడ్యూసర్లకు మాట ఇస్తున్నారట. సో ఈ లెక్కన ఒక ఏడాది అటుఇటు అయినా 2024లో కొబ్బరికాయ కొట్టడం ఖాయమే.  కాకపోతే అది ఆదిత్య 999 లేదా ఇంకేదైనా ఫ్రెష్ కథానేది తెలియాల్సి ఉంది

ఎప్పుడు వచ్చినా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ రూపం వరకే చూస్తున్న వాళ్లకు అతని డాన్స్, నటన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి విపరీతంగా ఉంది. ఎన్టీఆర్ రెండో తరంలో బాలకృష్ణ తర్వాత స్టార్ డంని తెచ్చుకుంది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. కళ్యాణ్ రామ్ కు గుర్తింపు ఉంది కానీ భారీ మార్కెట్ ఏర్పడలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని వాళ్ళ కోరిక. హరికృష్ణ తరఫున తారక్ ఎలాగూ సెటిలయ్యాడు. నెక్స్ట్ బాలయ్య లెగసిని మోక్షజ్ఞ తీసుకోవడమే మిగిలింది. మహా అయితే ఇంకో సంవత్సరమే.