ఇదే ప్ర‌శ్న వేరే హీరోల‌ను అడ‌గ‌గ‌ల‌రా?

ఖుషి సినిమాకు తాను అందుకున్న ఆదాయం నుంచి కోటి రూపాయ‌ల మొత్తం అభిమానుల‌కు పంచుతానంటూ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ప్ర‌క‌ట‌న టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. వంద మంది అభిమానుల‌ను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి ల‌క్ష చొప్పున సాయం చేస్తాన‌ని విజ‌య్ ఖుషి స‌క్సెస్ ఈవెంట్లో ప్ర‌క‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. దీని ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. ఐతే ఈ స్టేట్మెంట్‌పై ఒక ప్రొడ‌క్ష‌న్ క‌మ్ డిస్ట్రిబ్యూష‌న్ హౌస్ స్పందించిన తీరు ట్విట్ట‌ర్లో హాట్ టాపిక్‌గా మారింది.

గూఢ‌చారి, సాక్ష్యం, రావ‌ణాసుర స‌హా ప‌లు చిత్రాల‌ను నిర్మించిన అభిషేక్ పిక్చ‌ర్స్.. విజ‌య్ హీరోగా న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. డిజాస్ట‌ర్ అయిన‌ ఆ చిత్రానికి గాను ఆ సంస్థ రూ.8 కోట్లు న‌ష్ట‌పోయింద‌ట‌. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ముఖంగా ఇప్పుడు ప్ర‌క‌టించి విజ‌య్‌ని నిల‌దీసింది. ఖుషి సినిమా ఆదాయం నుంచి అభిమానుల‌కు కోటి రూపాయ‌లు ఇవ్వ‌డం మంచిదే అంటూ.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్ చిత్రానికి తాము రూ.8 కోట్లు న‌ష్ట‌పోతే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని అభిషేక్ పిక్చ‌ర్స్ ట్విట్ట‌ర్ హ్యాండిల్లో పేర్కొన్నారు.

డియ‌ర్ విజ‌య్ అంటూ అత‌ణ్ని ట్యాగ్ చేసి ఈ విష‌యం వెల్ల‌డించారు. విజ‌య్ ఈ వ్య‌హారంలో జోక్యం చేసుకుని త‌మ‌ను కాపాడాల‌ని.. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు అండ‌గా నిల‌వాల‌ని పేర్కొన్నారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ న‌ష్టాల విష‌యంలో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కేఎస్ రామారావు సెటిల్ చేయ‌క‌పోవ‌డంతో.. ఆయ‌న భాగ‌స్వామిగా ఉన్న భోళా శంక‌ర్ రిలీజ్ విష‌యంలోనూ కొంత గొడ‌వ జ‌రిగింది.

అప్పుడు కూడా స‌మ‌స్య సెటిల్ కాక‌పోవ‌డంతో ట్విట్ట‌ర్లో విజ‌య్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ వేసిన‌ట్లుంది అభిషేక్ పిక్చ‌ర్స్ యాజ‌మాన్యం. మ‌రి దీనిపై విజ‌య్ ఏమంటాడో చూడాలి. ఐతే న‌ష్టం వ‌స్తే నిర్మాత‌ను నిల‌దీయ‌కుండా.. ఇలా బ‌హిరంగ వేదిక‌లో హీరో మీద ప‌డడం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.  ఇదే ప్ర‌శ్న పెద్ద ఫ్యామిలీల‌కు చెందిన స్టార్ హీరోల‌ను అడిగే ధైర్యం ఉందా అని కూడా చాలామంది నెటిజ‌న్లు అభిషేక్ పిక్చ‌ర్స్ వాళ్ల‌ను అడుగుతున్నారు.