దేవరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కీలకం

జూనియర్  ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. బ్రేకులు లేకుండా పక్కా ప్లానింగ్ తో ఇద్దరూ సమన్వయపరుచుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు . హీరోయిన్ జాన్వీ కపూర్ కు సంబంధించిన కీలక భాగం ఈ నెలాఖరులోగా మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ సైతం క్రమం తప్పకుండ డేట్లు ఇస్తూ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇక దేవరకు సంబందించిన ఒక ముఖ్యమైన లీకు ఆడియన్స్ కి ఉత్సుకత రేపి ఆసక్తి పెంచేలా ఉంది.

దాని ప్రకారం దేవరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా నిలవబోతోంది. తారక్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్త ముందు నుంచి అది కానీ అధికారిక ధ్రువీకరణ లేదు. తండ్రి పాత్రలో జూనియర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, దానికి సంబంధించిన లీడ్ తో రెండో ఎన్టీఆర్ ని మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని వినిపిస్తోంది. అయితే బాహుబలి తరహాలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. కథలో చాలా స్కోప్ ఉండటంతో రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కొరటాల బృందంలో ఉన్నట్టు వినిపిస్తోంది.

ఎలాగూ దేవర తర్వాత తారక్ కు బ్రేక్ వస్తుంది. వార్ 2 డిసెంబర్ లో మొదలుపెట్టొచ్చు. దాని రిలీజ్ 2025లో. సలార్ ఒక్క భాగానికే కిందా మీద అయిపోతున్న ప్రశాంత్ నీల్ తనకు వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాడా లేక దాని సీక్వెల్ ని పూర్తి చేసి అప్పుడు తన స్క్రిప్ట్ పని చూస్తాడా అనే దాని మీద జూనియర్ కు సరైన క్లారిటీ లేదట. దీనివల్ల కొంత ఆలస్యం జరగొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్ కి గ్యాప్ అనిపించకుండా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 మొదటి భాగం, 2025లో సీక్వెల్ ప్లాన్ చేసుకుంటే ఏ లోటూ ఉండదు. క్షణాల్లో నిర్ణయాలు మారిపోతున్న పరిస్థితుల్లో ఏదీ ఖరారుగా చెప్పలేం.