మెగా ప్రశంసలు మైలేజ్ ఇస్తాయా

ఇంకో రెండే రోజుల్లో విడుదల కాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ దక్కాయి. ప్రత్యేకంగా షో చూసిన ఆయన టీమ్ ని ఇంటికి పిలిచి మరీ అభినందించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. హీరో నవీన్ పోలిశెట్టితో పాటు దర్శకుడు మహేష్ బాబు, నిర్మాత కలిసినవాళ్లలో ఉన్నారు. ఆ అందమైన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చిరునే స్వయంగా పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 7న జవాన్ తో పోటీ పడుతున్న ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ లో సగం టైటిల్ అనుష్కదన్న సంగతి తెలిసిందే.

హీరోయిన్ అయినప్పటికీ వ్యక్తిగతంగా ప్రమోషన్లకు రాలేని పరిస్థితిలో ఉండటంతో ఆ బరువు మొత్తం నవీన్ ఒక్కడే మోస్తున్నాడు. మెగా 157 యువి సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో భోళా శంకర్ టైంలో అనిల్ సుంకర ఇదే తరహాలో శ్రీవిష్ణు టీమ్ ని తీసుకొచ్చి సామజవరగమనకు ఆశీర్వాదం ఇప్పించారు. అది ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. చిరుకు తన సినిమా పోయినా సపోర్ట్ ఇచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ కావడం సంతోషమేగా. ఈ లెక్కన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి మెగా మద్దతు ఒకరకంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అసలే జవాన్ తో తీవ్రమైన కాంపిటీషన్ ఎదురుకుంటున్న ఈ సినిమాకు ఖుషి వీక్ డేస్ డ్రాప్ సానుకూలంగా మారుతుందని ఎదురు చూస్తోంది. షారుఖ్ ఖాన్ సినిమా మీద ఎంత బజ్ ఉన్నప్పటికీ అది కంప్లీట్ గా యాక్షన్ డ్రామా. ఫ్యామిలీ ఆడియన్స్ అంత సులభంగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉండకపోవచ్చు. కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆ ఇబ్బంది లేదు. ఒక టిపికల్ పాయింట్ ని తీసుకుని వినోదాత్మకంగా దర్శకుడు మహేష్ బాబు ప్రయత్నించాడు. ఆ విషయం ట్రైలర్ లోనే అర్థమైపోయింది. చిరంజీవి అంతగా మెచ్చుకున్నారంటే కంటెంట్ ఏదో బలంగానే ఉండేలా ఉంది. ఫలితం తేలనుందిగా చూద్దాం.