సెప్టెంబర్ 28 – ఇంత పోటీ ఏంటయ్యా బాబూ

సలార్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తప్పుకోవడం లాంఛనమే. అధికారికంగా ప్రకటించలేదన్న మాటే కానీ డిస్ట్రిబ్యూటర్ వర్గాలకు, డబ్బింగ్ హక్కులు కొనుక్కున్న నిర్మాతలకు ఆల్రెడీ సమాచారం వెళ్లిపోయింది. దీంతో అప్పటికప్పుడు పోస్టర్లు డిజైన్ చేయించి కొత్త సినిమాలు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముందుగా సితార నాగవంశీ తన ‘మ్యాడ్’ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’తో పాటు శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’ అదే తేదీకి దించాలనే ఆలోచనతో హడావిడిగా అప్పటికప్పుడు దర్శక నిర్మాతలు మీటింగ్ జరుపుతున్నట్టు తాజాగా తెలిసిన అప్డేట్.

ఇంకోవైపు రామ్ ‘స్కంద’కి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందనే కోణంలో చాలా సేపటి నుంచి డిస్కషన్లు జరుగుతున్నాయని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న దర్శకుడు బోయపాటి హీరోతో కలిసి తీవ్ర సమాలోచనలు చేస్తున్నట్టు వినికిడి. వీళ్లంతా ఓకే కానీ మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20ని ఆల్రెడీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భగవంత్ కేసరి, లియోలతో నేరుగా తలపడటం వల్ల స్క్రీన్లు తగ్గి ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందనే టెన్షన్ అభిమానుల్లో లేకపోలేదు. అందుకే సెప్టెంబర్ 28 లేదా 29కు ప్రీ పోన్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆలోచిస్తున్నారట.

ఇక్కడ చెప్పిన సినిమాల్లో దేనికి సంబంధించినది అయినా హఠాత్తుగా పోస్టర్ రూపంలో అప్పటికప్పుడు అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు. కేవలం సలార్ కోసమే ఈ నెల మూడు నాలుగు వారాలు వదిలేసిన టాలీవుడ్, కోలీవుడ్ ఇతర నిర్మాతలు ఇప్పుడు ఆఘమేఘాల మీద ఫైనల్ కాపీలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట. ఒక్క ప్రభాస్ పక్కకు తప్పుకోవడంతో చాలా సమీకరణాలు మారిపోతున్నాయి. ఇదేదో ఇంకాస్త ముందుగా తెలిసుంటే బాగుండేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రభాస్ కి ఇలా జరగడం మొదటిసారి కాదుగా. బాహుబలి నుంచి ఇదే తంతు.