లేటుగా వచ్చినా జోష్ తగ్గట్లేదు

ఈ నెలలో వచ్చిన భారీ చిత్రం ‘భోళా శంకర్’ తీవ్ర స్థాయిలో నిరాశ పరిచాక.. టాలీవుడ్ ట్రేడ్ ఆశలన్నీ ‘ఖుషి’ మీదే నిలిచాయి. విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ముందు నుంచి బజ్ ఉంది. విజయ్ చివరి సినిమా ‘లైగర్’, సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లయినప్పటికీ.. ఆ ప్రభావం ‘ఖుషి’ మీద పడలేదు.

‘టక్ జగదీష్‌’తో దారి తప్పిన శివ నిర్వాణ.. ‘ఖుషి’లో మళ్లీ తన మార్కు చూపించినట్లే కనిపిస్తున్నాడు. మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ అందించిన పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తెచ్చాయి. ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. మొత్తంగా రిలీజ్ ముంగిట ‘ఖుషి’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఖుషి’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా మొదలయ్యాయి. కానీ దీని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

నిన్న ఉదయం ‘ఖుషి’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన దగ్గర్నుంచి జోష్ మామూలుగా లేదు. పెద్ద సినిమాల రేంజిలో దీనికి బుకింగ్స్ జరుగుతున్నాయి. చాలా వరకు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్‌ మోడ్‌లో ఉన్నాయి. కొన్ని షోలు సోల్డ్ ఔట్ కూడా అయిపోయాయి. మామూలుగా ఒక హీరో చివరి చిత్రం డిజాస్టర్ అయితే.. దాని తాలూకు ప్రతికూల ప్రభావం తర్వాతి సినిమా మీద పడుతుంది.

కానీ ‘ఖుషి’కి ఆ సమస్యేమీ లేదు. సింగిల్ స్క్రీన్లలో బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ.. మల్టీప్లెక్సుల్లో మాత్రం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. హైదరాబాద్‌లో అన్ని ప్రధాన మల్టీప్లెక్సుల్లోనూ ‘ఖుషి’కి మెజారిటీ స్క్రీన్లు ఇచ్చారు. అవన్నీ కూడా హౌస్ ఫుల్స్‌తో రన్ కాబోతున్నాయి తొలి రోజు. వీకెండ్ మొత్తానికి కూడా ఈ జోష్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్ బాగుంటే ‘ఖుషి’ ఊహించని స్థాయిలోనే నంబర్స్ నమోదు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.