ముగ్గురి బాధ్యత ఖుషీ భుజాల మీద

రోజుల నుంచి ఖుషి కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోయింది. మ్యూజికల్ కన్సర్ట్ చేయడం మినహాయించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ మొగ్గు చూపలేదు. సమంతా అందుబాటులో లేదు కాబట్టి కేవలం హీరో ఒక్కడితోనే చేస్తే అంత బాగుండదనే ఉద్దేశంతో ఆగిపోయినట్టు ఇన్ సైడ్ టాక్. దాని తోడు ఓవర్ ప్రమోషన్లు చేసి హైప్ కోసం పాకులాడే బదులు టాక్ మీదే ఆధారపడి పబ్లిక్ కే దాన్ని వదిలేయాలని నిర్ణయించుకోవడంతో కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమయ్యారు. లో ప్రొఫైల్ కు వచ్చినా సరే అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నట్టు ఫిగర్లు చెబుతున్నాయి.

ఖుషి మీద ముగ్గురికి సక్సెస్ ఇవ్వాల్సిన బరువుంది. మొదట విజయ్ దేవరకొండకు లైగర్ గాయం మాయం కావాలి. దాని విడుదలకు ముందు హైప్ కోసం మాట్లాడినవన్నీ రివర్స్ లో ట్రిగ్గరయ్యాయి. అప్పటి నుంచి తగ్గి చాలా బ్యాలన్స్ గా మాట్లాడుతున్నాడు. గీత గోవిందం తర్వాత అంత పెద్ద సక్సెస్ మళ్ళీ చూడలేదు. ఇక సమంతా విషయానికి వస్తే శాకుంతలం ఇచ్చిన షాక్ ఇంకా పచ్చిగా ఉంది. అందరూ మర్చిపోయారు కానీ ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం తనకూ ఉంది. చికిత్స పూర్తి చేసుకుని యుఎస్ నుంచి తిరిగి వచ్చాక ఖుషి హిట్టే పాస్ పోర్ట్ కానుంది

ఇక దర్శకుడు శివ నిర్వాణ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నిన్ను కోరి, మజిలీ తర్వాత టక్ జగదీష్ రూపంలో ఓటిటి ఝలక్ తగిలింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా దట్టించి తీసినా జనం మెప్పు పొందలేదు. ప్రైమ్ రిలీజ్ కాబట్టి వ్యూస్ భారీగా వచ్చాయి కానీ కంటెంట్ మాత్రం విమర్శకులకు గురైంది. ఈ నేపథ్యంలో విజయ్, సామ్, శివలకు ఖుషి సక్సెస్ కావడం చాలా కీలకం. పోటీ లేని పెద్ద అడ్వాంటేజ్ తో బరిలో దిగుతున్న ఈ లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కు సరిపడా థియేటర్లు దొరికాయి. బాక్సాఫీస్ డ్రైగా ఉన్న ఈ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుంటే కనీసం రెండు వారాల పాటు ఢోకా ఉండదు.