ఆ కమెడియన్ కూడా హీరో అయిపోతున్నాడు

తెలుగులో ఒకప్పుడు కమెడియన్లు హీరో అవతారం ఎత్తాలంటే భయపడేవాళ్లు. మనం హీరోయిజం చేస్తే ఎవడు చూస్తాడనే భావన ఉండేది. బ్రహ్మానందం, బాబూ మోహన్ లాంటి వాళ్లు హీరోలుగా నటించినప్పటికీ.. అవి వాళ్ల ఇమేజ్‌కు తగ్గ సినిమాలు. అందులో వాళ్లేమీ హీరోల్లా విన్యాసాలు చేయలేదు.

ఆ ఒకటీ అరా సినిమాలకు లీడ్ క్యారెక్టర్లను పరిమితం చేసి.. ఆ తర్వాత మామూలుగా కామెడీ రోల్స్ చేసుకుంటూ పోయారు. కానీ ఇప్పటి కమెడియన్ల తీరు వేరు. కాస్త పేరు రాగానే హీరోలైపోతున్నారు.

వాటిలో వీర లెవెల్లో ఎలివేషన్లు.. మాస్ హీరోల్లా ఫైట్లు, డ్యాన్సులు.. ఇంకా ఎన్నో విన్యాసాలు. భరించడం చాలా చాలా కష్టమైపోయి.. కమెడియన్లు హీరోలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది. సునీల్‌తో మొదలుపెడితే షకలక శంకర్ వరకు ఇదే పరిస్థితి.

ఇలాంటి తరుణంలో మరో కమెడియన్ హీరో కాబోతుండటం విశేషం. అతనెవరో కాదు.. సత్య. ‘స్వామిరారా’ నుంచి ‘మత్తు వదలరా’ వరకు అనేక సినిమాల్లో కమెడియన్‌గా సత్తా చాటాడు సత్య. అతడి కామెడీ టైమింగ్ భలేగా ఉంటుంది. చూడగానే నవ్వు తెప్పించే అతి కొద్దిమంది కమెడియన్లలో సత్య ఒకడు.

అతనిప్పుడు హీరో అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. యువ కథానాయకుడు సందీప్ కిషన్.. నిర్మాతగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకెంతగానో నచ్చిన ఓ ప్రముఖ నటుడు ఇందులో హీరో అని అతను పేర్కొన్నాడు. ఆ పేరును గెస్ చేసే పనిలో ఉన్నారు నెటిజన్లు.

సందీప్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఆ వ్యక్తి సత్యనే అట. అతడి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కామెడీ సబ్జెక్ట్ ఇదని.. కచ్చితంగా క్లిక్ అవుతుందని అంటున్నారు. రామ్ అబ్బరాజు అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.