జవాన్ ప్లానింగ్ మీద అభిమానుల ఆగ్రహం

సరిగ్గా ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ జవాన్ కు సంబంధించిన ప్రమోషన్ ప్లానింగ్ విషయంలో జరుగుతున్న అలసత్వం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. పఠాన్ రికార్డులు బద్దలు కొడుతుందని నమ్మకం పెట్టుకుంటే హైప్ ని పెంచే క్రమంలో రెడ్ చిల్లీస్ సంస్థ చూపిస్తున్న నిర్లక్ష్యం విమర్శలకు దారి తీస్తోంది. ఇవాళ ట్రైలర్ వస్తుందని నిన్నంతా హడావిడి చేశారు. కట్ చేస్తే అది ఇంకా ఫైనల్ స్టేజిలో ఉందని దాని బదులు వేరొక పాట వస్తుందని అనధికారికంగా చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు.

ఎంత షారుఖ్ మూవీ అయినా సరే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు ఆట్లీ జవాన్ ని తీర్చిదిద్దాడు. డబ్బింగ్ హక్కులు కూడా భారీ రేట్లకు అమ్మారు. ఉదాహరణకు తెలుగు రైట్స్ గిట్టుబాటు కావాలంటే ఎంత లేదన్న అరవై కోట్ల దాకా గ్రాస్ వసూలు కావాలి. ప్రీ వ్యూ పేరుతో కొన్ని వారాల క్రితం వదిలిన వీడియోలో విజువల్స్ బాగున్నాయి కానీ తామింకా ఎక్కువ కోరుకున్నామని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న షారుఖ్ బృందం కొత్త ట్రైలర్ ని చాలా గొప్పగా కట్ చేయించిందనే టాక్ ముంబై సర్కిల్స్ లో తిరుగుతోంది.

నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ లో షారుఖ్ ఖాన్ మొత్తం అయిదు గెటప్స్ లో కనిపిస్తాడు. వాటిలో కీలకమైన గుండు బాస్ లుక్కు కూడా ఉంది. ఇన్ని సానుకూలమైన అంశాలు ఉండగా పబ్లిసిటీ పరంగా ఎందుకు వెనుకబడుతున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. అనిరుద్ రవిచందర్ పాటలు ఏదో బాగానే ఉన్నాయనిపిస్తున్నాయి కానీ జైలర్ రేంజ్ లో ఇచ్చాడానే అనుమానాలు లేకపోలేదు. సెప్టెంబర్ 7న బిగ్గెస్ట్ రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న జవాన్ అర్జెంటుగా వేగం పెంచి మొదటి రోజే చూడాలన్నంత కోరిక సినిమా ప్రేమికుల్లో కలిగిస్తేనే రికార్డుల మోత మ్రోగుతుంది. లేదంటే ట్విస్టు తప్పదు.