మహేష్ బాబు ఫీలవ్వాలా..?

‘పుష్ప’ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అతడి అభిమానులను అమితానందానికి గురి చేస్తోంది. సగటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈ విషయంలో ఎంతో ఆనందిస్తున్నారు. కానీ అదే సమయంలో మహేష్ అభిమానులు ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. అందుక్కారణం.. ‘పుష్ప’ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కావడమే.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్.. సినిమా కమిటైంది మహేష్ బాబుతోనే. వీళ్లిద్దరూ దాదాపు సంవత్సరం పాటు కథా చర్చలు జరిపారు. ముందు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఒక కథను అనుకుని.. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ మీదికి ఫోకస్ మళ్లించాడు సుకుమార్. కొన్ని నెలల పాటు చర్చోపచర్చల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి మహేష్ వైదొలిగాడు. ఇందుక్కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని మహేషే స్వయంగా వెల్లడించాడు. సామరస్యపూర్వకంగానే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

ఐతే తర్వాత అల్లు అర్జున్‌తో ట్రావెల్ అయిన సుకుమార్.. కథను ఒక కొలిక్కి తెచ్చి ‘పుష్ప’ను పట్టాలెక్కించాడు. ఈ సినిమా విడుదల తర్వాత ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓ మోస్తరుగానే ఆడినా.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ కావడం అనూహ్యం. ఈ సినిమా వల్ల బన్నీ మార్కెట్ అమాంతం విస్తరించింది. దీంతో మహేష్ బదులు బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడనే బాధను అప్పట్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. ఇప్పుడు బన్నీ ఏకంగా జాతీయ అవార్డు గెలవడంతో ఇది మహేష్‌కు దక్కాల్సింది కదా అని ఫీలవుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. మహేష్‌తో చర్చలు జరిపినపుడు ‘పుష్ప’ కథా స్వరూపం కానీ.. పాత్ర కానీ ఇప్పుడు అనుకున్నట్లుగా లేదు. అసలు మహేష్‌తో పోలీస్ పాత్ర చేయించాలనే ఆలోచన చేశాడు సుకుమార్.

ఒకవేళ స్మగ్లర్ పాత్ర చేసినా.. బన్నీ చేసినట్లు రగ్డ్ క్యారెక్టర్ లాగా, డీగ్లామరస్‌గా ఉండేది కూడా కాదు. మహేష్ లుక్స్, ఇమేజ్‌కు ఆ పాత్రను అలా చూపించేవాళ్లు కాదు. మహేష్ కూడా ఒప్పుకునేవాడు కాదు. కథ, పాత్ర స్వరూపాలు వేరుగా ఉన్నపుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చేదో.. సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకునేదో.. జాతీయ అవార్డుకు మహేష్ పేరును కన్సిడర్ చేసేవారో కాదో చెప్పలేం. కాబట్టి మహేష్ జాతీయ అవార్డు మిస్సయ్యాడని ఫీలవ్వాల్సిన పని లేదు.