షారుఖ్ మీద ప్రభాస్ ఆధిపత్యం

తన సినిమాల ఫలితాలతో సంబంధం లేనంత ఎత్తుకి ప్రభాస్ ఇమేజ్ చేరుకుందన్న మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ల తర్వాత వస్తున్న సలార్ చుట్టూ ఏర్పడుతున్న హైప్ చూసి బాలీవుడ్ వర్గాలకు నోట మాట రావడం లేదు. ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న షారుఖ్ ఖాన్ జవాన్ ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఓవర్సీస్ లో 1 లక్ష 60 వేల డాలర్లు వసూలు చేస్తే ఇంకా నెలకు పైగా టైం ఉన్న సలార్ 1 లక్ష 90 వేల డాలర్లు దాటేసి ఏ క్షణమైనా రెండు లక్షలను అందుకోబోతోంది. ఈ లెక్కన చాలా త్వరగా మిలియన్ మార్కు అందుకోవడం ఖాయం.

సలార్ కు సంబంధించి ఇంకా ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్ మొదలుపెట్టలేదు. చిన్న టీజర్ వదిలారు కానీ అందులో ప్రభాస్ మొహం సైతం సరిగా చూపించలేదు. కేవలం డైనోసర్ అనే పదం వాడి హైప్ పెంచేశారు. ట్రైలర్ కట్ పనుల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 3న లాంచ్ జరిగే అవకాశాలున్నాయి. ఇది వచ్చాక మొత్తం లెక్కలు మారిపోతాయని, ఊహించని స్థాయిలో అరాచకం చూడొచ్చని బయ్యర్లు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ విషయంలో వెనుకబడటం వల్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం.

ఈ లెక్కన షారుఖ్ ని మించిన క్రేజ్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడనే సంతోషం అభిమానుల్లో కనిపిస్తోంది. సలార్ తో పోలిస్తే జవాన్ లో చాలా ఆకర్షణలున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం, నయనతార-దీపిక పదుకునేల గ్లామర్, విజయ్ సేతుపతి విలనీ, మూడు వందల కోట్ల బడ్జెట్, షారుఖ్ డ్యూయల్ రోల్, అంచనాలు పెంచేసిన ట్రైలర్ ఇలా ఎన్నో కనిపించాయి. కానీ డార్లింగ్ ప్లస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ ముందు అన్నీ చిన్నబోతున్నాయి. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ఆలోచనలో ఉన్న జవాన్ మీద ఖచ్చితంగా పఠాన్ రికార్డులు దాటాలనే ఒత్తిడి బలంగా ఉంది.