అతణ్ని సరిగ్గా వాడుకుంటే..

టాలీవుడ్లో బ్రహ్మానందం సహా నిన్నటి తరం కమెడియన్లందరూ డౌన్ అవుతున్న టైంలో వెన్నెల కిషోర్ రైజ్ అయ్యాడు. అప్పటికే అతను తనదైన ముద్ర వేసినప్పటికీ.. బ్రహ్మి డౌన్ అయ్యాక మరింత చెలరేగిపోయాడు. బ్రహ్మి లాగే కొన్ని సినిమాలను తన కామెడీతో నిలబెట్టాడు అంటే అతిశయోక్తి కాదు. రాను రాను తెలుగు సినిమాల్లో కామెడీ డోస్ తగ్గిపోతున్నప్పటికీ.. వెన్నెల కిషోర్ ఉన్నాడంటే కనిపించినంత సేపు నవ్వులు గ్యారెంటీ అనే భరోసాను ఇవ్వగలిగాడు.

కానీ కిషోర్ కూడా ఈ మధ్య వేస్ట్ అయిపోతున్నాడనే ఫీలింగ్ కలుగుతోంది. అతణ్ని దర్శకులు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. కిషోర్‌కు చిన్న ఛాన్స్ ఇచ్చినా ఎలా చెలరేగిపోతాడో ‘సామజవరగమన’ లాంటి సినిమాలు ఉదాహరణ అయితే.. అతణ్ని ఎలా వేస్ట్ చేసుకోవాలో చెప్పడానికి ‘భోళా శంకర్’ లాంటి చిత్రాలు ఎగ్జాంపుల్.

ఐతే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఏకంగా హీరో అయిపోతున్నాడు. అతను లీడ్ రోల్‌లో ‘చారీ 111’ అనే సినిమాను నిన్న అనౌన్స్ చేశారు. ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కిషోర్‌ది ప్రత్యేకమైన కామెడీ టైమింగ్. అతడికి వెర్రి వెంగళప్ప పాత్రలు ఇస్తే అదరగొడతాడు. టిపికల్ క్యారెక్టర్లను బాగా పోషిస్తాడు.

‘చారీ 111’లో తాను కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక తింగరి ఏజెంట్ పాత్రలో అతను కనిపించబోతున్నాడు. ఇంట్రో వరకు అయితే ఈ క్యారెక్టర్, సినిమా ఎగ్జైటింగ్‌గానే అనిపిస్తున్నాయి. సినిమా ఫుల్లుగా ఇదే ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో ఉంటే.. కిషోర్‌ను పూర్తిగా వాడుకుంటే ప్రేక్షకులు కడుపులు చెక్కలయ్యేలా నవ్వులు పండటం గ్యారెంటీ. అదితి సోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి అతను కిషోర్‌ను ఎంత బాగా ఉపయోగించుకుంటాడో చూడాలి.