ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు

ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడు మంచు మనోజ్. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసినప్పటి నుంచి 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ వరకు అతను దాదాపు 20 సినిమాల్లో నటించడం విశేషం. ఇంత స్పీడు చూపించిన హీరో నుంచి.. 2017 తర్వాత ఆరేళ్ల పాటు ఒక్క రిలీజ్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకుల కారణంగా అతను సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశాడు. ఆ సినిమా ఎంతకీ మొదలు కాకపోగా.. సడెన్‌గా ‘వాట్ ద ఫిష్’ అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పుడు కానీ ‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయిన సంగతి జనాలకు అర్థం కాలేదు.

పోనీ కొత్త సినిమాను ప్రకటించాక అయినా మనోజ్ వెంటనే షూట్‌‌కు వెళ్లాడా అంటే అదీ లేదు. నెలలు గడుస్తున్నా ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఈ సినిమా సంగతి ఏమవుతుందో అని మనోజ్ ఫ్యాన్స్ కంగారు పడుతుండగా.. ఎట్టకేలకు మనోజ్ నుంచి షూట్ అప్‌డేట్ వచ్చింది. తాను తిరిగి కెమెరా ముందుకు వచ్చిన విషయాన్ని వెల్లడిస్తూ ఈ రోజు ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు మనోజ్.

మళ్లీ సినిమా అమ్మ దగ్గరికి వచ్చానంటూ కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అతను పోస్ట్ చేశాడు. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో ఇలా ఆరేళ్ల పాటు కెరీర్లో గ్యాప్ తీసుకోవడం అన్నది అరుదైన విషయం. సరైన సినిమాలు ఎంచుకోక మనోజ్‌కు వరుసగా ఫ్లాపులు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు బిందాస్, కరెంటు తీగ, పోటుగాడు లాంటి సినిమాలతో అతను మంచి ఊపుమీదే ఉండేవాడు. ‘వాట్ ద ఫిష్’ టైటిల్, ప్రోమోలు చూస్తే.. మళ్లీ మనోజ్ ఒక క్రేజీ రైడ్‌కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తన ఫ్యాన్స్‌ను అతను అలరిస్తాడని ఆశిద్దాం.