అసలు అనుష్కకు ఏమైంది?

తెలుగులో విజయశాంతి తర్వాత అలాంటి హీరోయిక్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కథానాయిక అనుష్కనే. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు ఆమె బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో చూపించాయి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్థాయిలో తన ఫాలోయింగ్‌ను పెంచుకుంది అనుష్క. ఐతే ఈ సినిమాలో దేవేసన పాత్రతో మెస్మరైజ్ చేసిన అనుష్క నుంచి ఆ తర్వాత తరచుగా సినిమాలు రాకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

‘బాహుబలి-2’ తర్వాత ఒక్క ‘నిశ్శబ్దం’ సినిమాతో మాత్రమే అనుష్క పలకరించింది. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి మరో చిత్రం రావడానికి మూడేళ్లు పడుతోంది. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లు చాలా ముందుగానే మొదలైనప్పటికీ.. అనుష్క ఎక్కడా కనిపించడం లేదు.

రాబోయే రోజుల్లో కూడా అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటుందన్న సంకేతాలు కనిపించడం లేదు. అలా అని నయనతార లాగా అనుష్క ప్రమోషన్లలోనే పాల్గొనదా అంటే అలా ఏమీ కాదు. ‘బాహుబలి’ వరకు ఆమె తన చిత్రాలను బాగానే ప్రమోట్ చేసేది. కానీ ఆ తర్వాత బయట కనిపించడం లేదు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఆమె బరువు పెరిగి తగ్గే క్రమంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. ఆమె ఫిజిక్‌లో మార్పులు వచ్చాయని.. అందుకే పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతోందని ఇంతకుముందే గుసగుసలు వినిపించాయి.

ప్రమోషన్లకు రాకపోవడానికి తోడు.. ఇంతకుముందు ‘నిశ్శబ్దం’లో.. ఇప్పుడు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో అనుష్క లుక్స్ చూస్తే జనాలకు రకరకంగా సందేహాలు కలుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఆమె సహజంగా కనిపించలేదు. తన లుక్‌ను సీజీ సాయంతో పాలిష్ చేయడానికి ప్రయత్నించిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ముఖ్యంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో నవీన్ పక్కన ఆమెను యంగ్‌గా, నాజూగ్గా చూపించడానికి చాలానే కష్టపడినట్లున్నారు. అనుష్క లుక్స్ సహజంగా లేవని కాస్త సినిమా సెన్స్ ఉన్న ఎవ్వరైనా కనిపెట్టేస్తారు. అనుష్క ఫ్యాన్స్‌కు సైతం ఆమె సహజంగా కనిపించట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్లో ఇబ్బందికరంగా కనిపించింది ఆ ఫ్యాక్టరే. మరి సినిమాలో ఈ విషయం ఒక మైనస్ ఫ్యాక్టర్‌గా మారకుంటే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.