పంజా దర్శకుడి కోసం సల్మాన్ గుండు

నిన్న రాత్రి ఒక ఈవెంట్ కు హాజరైన సల్మాన్ ఖాన్ హఠాత్తుగా గుండుతో కనిపించేసరికి విచ్చేసిన అతిథులే కాదు సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ తిన్నారు. ఇటీవలే టైగర్ 3 షూటింగ్ ని పూర్తి చేసిన కండల వీరుడు షారుఖ్ ఖాన్ పఠాన్ లో చేసిన క్యామియో ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే. అయితే ఉన్నట్టుండి జుత్తు మొత్తం ఎందుకు తీయించాడనే సందేహం రావడం సహజం. ఇది కొత్త సినిమా గెటప్ కోసమట.  భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో కరణ్ జోహార్ నిర్మించబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం సల్మాన్ తన అవతారాన్ని పూర్తిగా మార్చుకున్నాడట.

దీనికి దర్శకుడు విష్ణువర్ధన్. ఉత్తినే పేరు చెబితే మన ఆడియన్స్ గుర్తు పట్టరు కానీ పవన్ కళ్యాణ్ కి పంజా లాంటి స్టైలిష్ డిజాస్టర్ ఇచ్చింది ఇతనే. అంతకు ముందు అజిత్ తో తీసిన బిల్లా చాలా పేరు తీసుకొచ్చింది. ఇది చూసే ప్రభాస్ తో మెహర్ రమేష్ బిల్లా రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. అజిత్ ఆరంభం ఓ మోస్తరుగా ఆడినా యట్చన్ అనే తమిళ చిత్రం ఫెయిలయ్యింది. గత ఏడాది సిద్దార్థ్ రాయ్ కపూర్ తో చేసిన షీర్షా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్  స్ట్రీమింగ్ జరుపుకున్నా చాలా ప్రశంసలు తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే డిజిటల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఇది చూసే సల్మాన్ ఆఫర్ ఇచ్చాడు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కరుడుగట్టిన క్యారెక్టర్ లో చాలా రఫ్ గా ఉంటుందట. కరణ్ తో పాటు సాజిద్ నడియాడ్ వాలా ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నారు. వచ్చే ఏడాది  2024 క్రిస్మస్ విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బిగ్ బాస్ 14 పూర్తి చేయడం కోసం ఎదురు చూసిన సల్లు భాయ్ అది పూర్తి కాగానే ఇలా క్షవర కళ్యాణం చేయించేసుకున్నాడు. కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణ ఫలితం తర్వాత సోలో హీరోగా సల్మాన్ నుంచి బలమైన హిట్టు కోరుకుంటున్నారు ఫాన్స్. టైగర్ 3 తీర్చేలానే ఉంది.