ప్రేక్షకుల ప్రేమ విలువ 1300 కోట్లు

కరోనా వచ్చి వెళ్ళిపోయాక ఇండియన్ బాక్సాఫీస్ అత్యంత గొప్ప వసూళ్లు చూసిన నెలగా  2023 ఆగస్ట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది. ఇటీవలే మల్టీప్లెక్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం హిస్టరీ ఎప్పుడూ చూడని కలెక్షన్లు ఈసారి నమోదయ్యాయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్లు కావడం ఇంత గొప్ప ఫలితానికి కారణమయ్యింది. ఒకవేళ భోళా శంకర్ డిజాస్టర్ కాకుండా కనీసం యావరేజ్ అయినా ఈ మేజికల్ ఫిగర్ మరింత పెరిగేది.

ఇప్పటిదాకా వచ్చిన నెంబర్లు చూస్తే జైలర్ అత్యధికంగా 550 కోట్లు, గదర్ టూ 480 కోట్లు, ఓ మై గాడ్ టూ 165 కోట్లు, భోళా శంకర్ 45 కోట్లకు సాధించి సుమారు 1300 కోట్లకు పైగా థియేటర్లకు పంపాయి. ఇదంతా కేవలం పన్నెండు రోజుల్లో జరిగిన ఊచకోత. ఇంకా నెల పూర్తవ్వలేదు కాబట్టి ఇంకా తోడవుతుంది. జనాలు తండోప తండాలు థియేటర్లకు రావడం చూసి ఎంత కాలమయ్యిందోనని బయ్యర్లు ఆనందపడుతున్నారు. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సన్నీడియోల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల రజనీకాంత్ ఓ రేంజ్ లో పబ్లిక్ ని లాక్కొస్తున్నారు. టికెట్ల కోసం రికమండేషన్లు పెట్టే స్థాయిలో ఆడేసుకున్నారు

ఇంత స్థాయిలో రెస్పాన్స్ చూశాక బాలీవుడ్ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మాస్ సినిమా పవర్ ఏంటో ఆడియన్స్ నిరూపించారని, సరైన కంటెంట్ తో వస్తే క్లాసు వర్గాలు కూడా ఎగబడతాయని ఋజువు కావడంతో రచయితలు దర్శకులు అలాంటి కథలు రాసుకునే పనిలో పడ్డారు. ఇప్పుడీ ఆగస్ట్ ఇచ్చిన ఉత్సాహంతో సెప్టెంబర్, అక్టోబర్ లు కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేయడం ఖాయమే అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్, రామ్, లారెన్స్, ప్రభాస్, బాలకృష్ణ, విజయ్, రవితేజ ఇలా పెద్ద లిస్టే ఈ రెండు నెలల్లో వరసగా దాడి చేయబోతున్నారు. ఇంతకు రెట్టింపు రికార్డులు రావడం ఖరారే.