అవసరం లేని రిస్క్ ఎందుకు విక్రమ్

మాములుగా ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ వల్ల రెండు మూడేళ్లు నిర్మాణంలో ఉండటం సహజం. రాజమౌళి లాంటి వాళ్లయితే దానికి న్యాయం చేకూరుస్తూ ప్యాన్ ఇండియా మూవీస్ ని అద్భుతంగా తీస్తారు. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ కి పది సంవత్సరాలు పట్టడం అంటే మహా విచిత్రం. చియాన్ విక్రమ్ గా మనకు అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ల ద్వారా దగ్గరైన ఈ విలక్షణ హీరో నటించిన ధృవ నచ్చత్తిరమ్ షూటింగ్ 2013లో మొదలైంది. ముప్పాతిక భాగం తీశాక ఏవేవో కారణాల వల్ల ఆగిపోయింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేతులు ఎత్తేసి యాక్టింగ్ వైపు వెళ్లిపోయారు.

కట్ చేస్తే ఇప్పుడు దీనికి మోక్షం కలిగింది. యుద్ధ కాండం పేరుతో మొదటి భాగాన్ని దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ఇందులో హీరోయిన్. అయితే విజయదశమికి ఆల్రెడీ విపరీతమైన పోటీ నెలకొంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ నువ్వా నేనాని తలపడుతున్నాయి. మధ్యలో రావడం వల్ల విక్రమ్ కు కలిగే నష్టమే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ చెప్పినవాటిలో మూడింటికి విపరీతమైన క్రేజ్ ఉంది. అనవసరంగా తలపెడితే డ్యామేజ్ తప్ప ఏం ప్రయోజనం లేదు .

త్వరలోనే దీనికి సంబందించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. ధృవ నచ్చత్తిరమ్ ప్రొడ్యూసర్లు కేవలం తమిళ మార్కెట్ నే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయినా కూడా రిస్కే. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఏడుగురు కెమెరా మెన్ లు పని చేశారు. మనోజ్ పరమహంస, రవిచంద్రన్, కథిర్ లాంటి ప్రముఖులు వాళ్లలో ఉన్నారు. ఇంత పెద్ద టీమ్ ని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గ్రాండియర్ ని ఇలా ఇంత సుదీర్ఘమైన కాలం ల్యాబులో మగ్గేలా చేయడం నిజంగా ట్రాజెడీ. ఫ్యాన్స్ లోనే దీని మీద ఆసక్తి తగ్గిపోయింది. ప్రమోషన్లు ఎలా చేసి బజ్ తెస్తారో చూడాలి మరి.