ప్రాణాల మీదకు తెచ్చిన ప్యాన్ ఇండియా సినిమా

అనుకుంటాం కానీ కష్టాలు కేవలం తెరమీదే కాదు నిర్మాతల జీవితాల్లోనూ ఉంటాయి. సినిమా తీసినంత మాత్రాన డబ్బులు వస్తాయన్న గ్యారెంటీ లేని ఫీల్డ్ ఇది. ముఖ్యంగా ఎలాంటి క్యాస్టింగ్ సపోర్ట్ లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసిన ప్రొడ్యూసర్లకు పట్టపగలే చుక్కలు కనిపించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. భారతదేశం స్వతంత్రం కోసం తెల్లదొరలతో పోరాడి చిన్న వయసులో అసువులు బాసిన వీరుడు ఖుదీరామ్ బోస్. ఆయన జీవిత కథను మల్టీ లాంగ్వేజెస్ లో నిర్మించారు విజయ్ జాగర్లమూడి. గత ఏడాది డిసెంబర్ లో పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించినప్పుడు ఎన్నో ప్రశంసలు దక్కాయి.

దీనికి పని చేసిన సాంకేతిక బృందం ఆషామాషీ వాళ్ళు కాదు. మణిశర్మ సంగీతం, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్, కనల్ కన్నన్ పోరాటాలు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం ఇలా లబ్దప్రతిష్ఠులైన వాళ్ళు టెక్నికల్ టీమ్ లో ఉన్నారు. ఖర్చుకి లెక్క చేయకుండా తీశారు. ప్రత్యేకంగా సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కలిసి ప్రీమియర్లకు ఆహ్వానించారు. ఇంతా చేసి ఖుదీరామ్ బోస్ రిలీజ్ కు నోచుకోక ఆలస్యం అవుతోంది. దీంతో ఆర్థిక ఒత్తిడికి లోనైన విజయ్ జాగర్లమూడి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

పేరున్న ఆర్టిస్టులు, ఇంత పెద్ద బృందం ఉన్న ప్యాన్ ఇండియా సినిమాకే ఈ పరిస్థితి రావడం విషాదం. ప్రభుత్వం అన్ని చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం చాలా అవసరం.పన్ను రాయితీలు, విడుదలకు మార్గం సుగమం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ చిత్రాలకు చూపినంత ఆసక్తి బయ్యర్లు ఫ్రీడమ్ ఫైటర్ల బయోపిక్ ల మీద చూపించరు. అందుకే ఈ సమస్యలు. బిజినెస్ జరగకుండా ఓటిటి, శాటిలైట్ లకు అమ్మడం కష్టం. ప్రస్తుతం విజయ్ చికిత్సలో ఉన్నారని తెలిసింది.