దిల్ రాజుకు వరంగా మారిన ‘పెద్దన్న’

సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి మూడు సినిమాలు పేట, దర్బార్, అన్నాత్తె.. ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరిచాయి. వసూళ్ల లెక్కలు కూడా సినిమా సినిమాకూ తగ్గుతూ వచ్చాయి. ‘అన్నాత్తె’ అయితే దారుణమైన ఫలితాన్నందుకుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజైన ఈ సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. గత మూడు దశాబ్దాల్లో రజినీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ప్రభావం చూపలేదు. అంత కనీస స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ఫుల్ రన్లో రూ.5 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి. కానీ ఈ సినిమాకు ఇలాంటి ఫలితం రావడం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు.. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్‌కు మాత్రం బాగా కలిసొచ్చింది. ఒక హీరో చివరి సినిమా ఫలితం ఆధారంగానే తర్వాతి చిత్రానికి బిజినెస్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ‘పెద్దన్న’ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో ‘జైలర్’కు కొంచెం క్రేజ్ ఉన్నా సరే.. రూ.12 కోట్లకే తెలుగు థియేట్రికల్ హక్కులు లభించాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో ‘జైలర్’ను రిలీజ్ చేశాడు దిల్ రాజు. సినిమా మీద పెట్టుబడిని రెండో రోజుకే రికవర్ చేసేసింది ‘జైలర్’. రెండో రోజే లాభాలు కూడా మొదలైపోయాయి. ఈ సినిమా వారం రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్స్‌తో నడుస్తోంది. వారం తిరిగేసరికే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ ఇప్పటికే రూ.30 కోట్లు దాటిపోయింది. ఫుల్ రన్లో షేర్ మాత్రమే రూ.50 కోట్లకు చేరువ అయినా ఆశ్చర్యం లేదు. అంటే పెట్టుబడి మీద ఎంత లాభమో అర్థం చేసుకోవచ్చు. ‘జైలర్’కు మంచి టాక్ వచ్చినా సరే.. ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయని దిల్ రాజు సహా ఎవ్వరూ ఊహించి ఉండరు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ పోటీలో ఉంది కాబట్టి వసూళ్లు ఒక స్థాయికి మించి రావని అంచనా వేసి ఉంటారు. కానీ ‘జైలర్’ దెబ్బకు చిరు సినిమా కుదేలైంది. దాని స్క్రీన్లను కూడా ఈ చిత్రంతోనే రీప్లేస్ చేశారు. ప్రేక్షకులు విరగబడి ఈ సినిమాను చూస్తుండటంతో వసూళ్లు కూడా అంచనాలకు అందని స్థాయిలో వస్తున్నాయి.