1995 పరిస్థితి మళ్ళీ వచ్చింది…అయితే  

అతి పెద్ద డిజాస్టర్ ని చవిచూసిన చిరంజీవి అభిమానులు కలెక్షన్లలో నమోదవుతున్న జీరో షేర్లను తట్టుకోలేక, వస్తున్న ట్రోల్స్ ని ఆపలేక ఒకరకంగా నరకం చూస్తున్నారు. రిలీజ్ కు ముందే నెగటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ ఏదో మాస్ ప్రేక్షకుల అండతో గట్టెక్కుతుందనే అనుకున్నారు కానీ తీరా ఫిగర్లు చూసి భోరుమంటున్నారు. గత ఏడాది ఆచార్య, ఇప్పుడీ భోళా శంకర్ ఒకరకంగా చెప్పాలంటే మాములు అవమానం కాదిది. అయితే పడ్డవాడు చెడ్డవాడు కాదనే రీతిలో స్టార్ లకి ఇలాంటి ఎగుడుదిగుడులు, ఎత్తుపల్లాలు సహజమే కానీ ఎంత బౌన్స్ బ్యాక్ అవుతామనేది చాలా కీలకం.

1995లో ఇంచుమించు ఇదే పరిస్థితిని, ఇలాంటి ఆత్మపరిశీలన స్టేజిని అనుభవించారు చిరు. ముఠామేస్త్రి తర్వాత వరస వైఫల్యాలు ఆయన మార్కెట్ ని బాగా దెబ్బ కొట్టాయి. మల్టీ స్టారర్ మెకానిక్ అల్లుడు ఘోరంగా దెబ్బ తినగా ట్రిపుల్ యాక్షన్ చేసిన ముగ్గురు మొనగాళ్లు అతి కష్టం మీద యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఎస్పి పరశురామ్, బిగ్ బాస్ నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అల్లుడా మజాకాకు డబ్బులు వచ్చినా వివాదాలు, విమర్శల ముందు అవి చిన్నవే. ఇక రిక్షావోడు ఇంకా అన్యాయం. ఇప్పటి భోళా రేంజ్ లో జనాలు థియేటర్లకు రాకుండా చేసింది.

తాను ఎక్కడ లెక్క తప్పుతున్నానో విశ్లేషించుకోవడానికి చిరు ఆరు నెలలకు పైగా మేకప్ కి దూరంగా ఉండి క్షుణ్ణంగా ఆలోచించి బడ్జెట్ రిస్క్ లేకుండా వచ్చిన హిట్లర్ ని ఒప్పుకున్నారు. కట్ చేస్తే అదో పెద్ద హిట్టు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. తిరిగి 2001లో మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ అంచనాలు అందుకోవడంలో ఫెయిలైతే ఇంద్ర వచ్చాకే ఫ్యాన్స్ సంతృప్తి చెందారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల నాటి సందిగ్దతను చిరు మళ్ళీ ఎదురుకుంటున్నారు. దీన్ని తీర్చే దర్శకుడు కళ్యాణ్ కృష్ణనో లేక వశిష్టలో ముందు ఎవరవుతారో చూడాలి