సుశాంత్ సోదరితో రియాకు గొడవ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక అతడి ప్రేయసి రియా చక్రవర్తి కూడా ఒక కారణమని బలమైన ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మానసికంగా కుంగిపోవడానికి రియానే కారణం అంటూ అతడి మాజీ అసిస్టెంట్ అంకిత్ కూడా ఆరోపించాడు. ఆమెతో ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి వచ్చాక సుశాంత్ తన ఆనందాలన్నీ కోల్పోయాడని అతనన్నాడు.

మరోవైపు రియా మీద సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా పలు ఆరోపణలు చేశారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ అయితే.. రియా రూ.15 కోట్ల మేర సుశాంత్ నుంచి తీసుకున్నట్లు ఆయన ఆరోపించాడు. ఇంకా పలు రకాలుగా తన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రియా తన లాయర్లతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసింది.

2019లో ఓ పార్టీకి హాజరైనప్పటి నుంచి సుశాంత్‌తో రియా డేటింగ్‌లో ఉన్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు రియా లాయర్లు. 2019 డిసెంబరు నుంచే వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నారని.. ఈ ఏడాది జూన్ 8న ఆ ఇంటి నుంచి రియా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రియా అకౌంటుకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని.. సుశాంత్ కుటుంబం చేస్తున్న ఆరోపణలన్నీ అర్థరహితమని అన్నారు. ఈడీ దర్యాప్తులోనూ ఇదే విషయం తేలిందన్నారు.

సుశాంత్‌తో పరిచయం అయ్యాక అతడి ఇంటికి రియా ఒక రోజు వెళ్లిందని.. అప్పుడు సుశాంత్ సోదరి ప్రియాంక, భర్త సిద్దార్థ్ కూడా అక్కడున్నారని.. సుశాంత్ గదికి వెళ్లి తను నిద్రపోగా.. అర్ధరాత్రి తన పక్కన ప్రియాంక ఉందని, అప్పుడామె అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ గది నుంచి వెళ్లిపోవాలని అందని.. దీనిపై సుశాంత్‌కు చెప్పగా వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో తన సోదరి వస్తోందని చెప్పడంతో సుశాంత్ ఇంటి నుంచి రియా వెళ్లిపోయిందని.. అంతకుమించి తనకేమీ తెలియదని.. సుశాంత్ కుటుంబ సభ్యులతో రియాకు సత్సంబంధాలు లేవని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.