భోళా బోల్తా.. స్క్రిప్టుపై మ‌ళ్లీ క‌స‌ర‌త్తు

గత ఏడాది ఆచార్య మూవీతో చిరంజీవి చాలా పెద్ద ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్నారు. మెగాస్టార్ కెరీర్లో డిజాస్ట‌ర్లు లేవ‌ని కాదు కానీ.. మ‌రీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ్డ సినిమాలు అరుదు. వీకెండ్లోనే థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి. మ‌ధ్య‌లో గాడ్ ఫాద‌ర్ కూడా ఆశించిన ప‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌తో చిరు బ‌లంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి మెగా అభిమానుల్లో తిరిగి ఉత్సాహాన్ని తెచ్చింది. కానీ భోళా శంక‌ర్ ఆ ఉత్సాహం మీద పూర్తిగా నీళ్లు చ‌ల్లేసింది. ఆచార్య‌ను మించి డిజాస్ట‌ర్ అయి చిరుకు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. చిరు త‌న సినిమాల ఎంపిక‌, జ‌డ్జిమెంట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రాన్ని భోళా శంక‌ర్‌ను గుర్తు చేసింది. అందుకే చిరు కూడా వెంట‌నే త‌న కొత్త సినిమాను మొద‌లుపెట్ట‌ట్లేదు.

క‌ళ్యాణ్  కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చిరు త‌న కొత్త చిత్రాన్ని వెంట‌నే మొద‌లుపెట్టాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఆలోచ‌న మారిన‌ట్లు తెలుస్తోంది. మోకాలి శ‌స్త్ర చికిత్స కూడా ఆల‌స్యానికి ఒక కార‌ణం అయిన‌ప్ప‌టికీ.. అత్య‌వ‌స‌రం కాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ టైంలోనే స‌ర్జ‌రీ పెట్టుకోవ‌డం ఒక ర‌కంగా బ్రేక్ కోస‌మే అంటున్నారు. చిరు కోలుకునే లోపు మ‌రోసారి స్క్రిప్టు మీద ప‌ని చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా బ్రో డాడీ రీమేక్ అని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అదేమీ కాద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

ఐతే మాతృక‌లో మూల క‌థ‌ను మాత్ర‌మే తీసుకుని పూర్తిగా డిఫ‌రెంట్ ట్రీట్మెంట్‌తో స్క్రిప్టు త‌యారు చేస్తున్నార‌ట‌. భోళా శంక‌ర్ త‌ర్వాత చిరు అలెర్ట్ అయి స్క్రిప్టు మీద మ‌రింత వ‌ర్క్ చేయాల‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో క‌ళ్యాణ్ కృష్ణ త‌న రైటర్స్ టీంతో క‌లిసి మ‌ళ్లీ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్లో సిట్టింగ్స్ మొద‌లుపెట్టిన‌ట్లు తెలిసింది. ఆల‌స్యం అయినా స‌రే.. రీమేక్ ఛాయ‌లు లేకుండా.. ప‌క‌డ్బందీగా స్క్రిప్టు రెడీ చేసుకుని చిరు ఆమోద ముద్ర వేశాక షూటింగ్‌కు వెళ్తార‌ట‌.