చిరు.. నో షూటింగ్?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు ‘భోళా శంకర్’ రూపంలో. ‘ఆచార్య’నే చిరు కెరీర్లో ‘లో’ అనుకుంటే.. ఇది అంతకుమించిన పతనాన్ని చూపిస్తోంది. ఫుల్ రన్లో పాతిక కోట్ల షేర్ కూడా కష్టమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ సినిమా.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అందరికీ అర్థమైపోయింది. ఇక సినిమా మీద ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు.

‘ఆచార్య’ తర్వాత సెటిల్మెంట్ సమస్యలతో ఇబ్బంది పడ్డట్లే ‘భోళా శంకర్’ తర్వాత కూడా చిరు అండ్ కోకు తలనొప్పులు తప్పేలా లేవు. ఐతే ఈ విషయాలను చిరు ఎలా డీల్ చేస్తాడో ఏమో కానీ.. తన కొత్త సినిమా షూటింగ్‌ను మాత్రం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేస్తాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజం కాకపోవచ్చని అంటున్నారు.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తన కూతురు సుశ్మిత నిర్మించే కొత్త చిత్రాన్ని చిరు ఈ నెలలోనే మొదలుపెడతాడని అనుకున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2024 సంక్రాంతి రేసులో నిలబడతారని కూడా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చిరు ఆలోచన మారిందట. కొంత కాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చిరు ఫిక్సయ్యారట.

ఢిల్లీ లేదా బెంగళూరులో సర్జరీ చేయించుకోవాలని చూస్తున్నారట. అది గనుక జరిగితే చిరు నెలా రెండు నెలలు షూటింగ్‌లో పాల్గొనరు. పూర్తిగా విశ్రాంతికే పరిమితం అవుతారు. అంటే కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలవడంలో ఆలస్యం తప్పదు. అంటే సంక్రాంతికి ఆ సినిమా లేనట్లే. వేసవిని టార్గెట్ చేయొచ్చు. చిరుకు ఇప్పుడీ విరామం చాలా అవసరమని.. ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత సినిమాల ఎంపికలో చిరు పునరాలోచనకు ఇది ఉపయోగపడుతుందని అభిమానులు అంటున్నారు.