జబర్దస్త్ బ్యాచు వల్ల లాభమా నష్టమా

భోళా శంకర్ లో చిరంజీవి చుట్టూ ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి ఏదో కామెడీని పిండుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్టే ఉందని థియేటర్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. గెటప్ శీను, బిత్తిరి సత్తి, లోబోలతో పాటు ఈ మధ్య సినిమాల్లో బాగా పేరు తెచ్చుకుంటున్న కమెడియన్ సత్యని కనీస స్థాయిలో వాడుకోలేక పోవడం మైనస్ అయ్యింది. దీనికి తోడు శ్రీముఖితో ఏదో రొమాంటిక్ కామెడీ చేయాలని చూడటం అసలుకే మోసం చేసింది. పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో ఖుషి నడుము సీన్ ని రీ క్రియేట్ చేయడం అడ్డంగా బెడిసి కొట్టింది. విజిల్స్ బదులు ట్రోలింగ్స్ పడుతున్నాయి.

వీటి సంగతలా ఉంచితే కేవలం తనకు దగ్గరగా ఉంటూ జీవితంలో ఒక్కసారైనా కలిసి నటించాలనే కోరిక వెలిబుచ్చడం వల్లే చిరు రికమండ్ చేసి మరీ దర్శకులతో పాత్రలు సృష్టింపజేస్తున్నారనే కామెంట్ ముందు నుంచి ఉంది. ఖైదీ నెంబర్ 150లో గెటప్ శీనుతో మొదలైన ఈ ప్రహసనం ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపించే లోబో దాకా తీసుకొచ్చింది. వాళ్ళ కోరిక తీర్చడం సంతోషమే కానీ దాని వల్ల సినిమా మీద పడుతున్న ఇంపాక్ట్ ని కూడా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. స్టోరీ డిమాండ్ చేయడం వేరే లేనిది అదే పనిగా బలవంతంగా ఇరికించడం వేరే.

అయినా టీవీలో రోజు చూసే వాళ్ళను మళ్ళీ డబ్బులిచ్చి టికెట్లు కొనే స్క్రీన్ మీద చూడాలానేది నెటిజెన్లు చేస్తున్న మేజర్ కంప్లయింట్. ఇది ఆలోచించాల్సిన లాజిక్కే. ఎందుకంటే ఛానల్స్ లో, యూట్యూబ్ వేలాది వీడియోల్లో ఎక్కడబడితే అక్కడ కనిపించే వాళ్ళను చిరంజీవి లాంటి పెద్ద హీరో చిత్రంలో అదే పనిగా తేవడం వర్కౌట్ కావడం లేదు. వీళ్లకు తోడు యాంకర్ రష్మీ గౌతమ్ ని కిల్లి చుట్టిచ్చే ఐటెం గర్ల్ గా చూపించడం సింక్ కాలేకపోయింది. ఇకనైనా అవసరం ఉంటే తప్ప అదనపు ఆర్టిస్టులను తీసుకోవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి చిరు సీరియస్ గా ఆలోచిస్తారా.