దేశం కోసం ప్రాణాలకు తెగించే అర్జునుడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన భారీ చిత్రం గాండీవధారి అర్జున ఈ నెల 25న విడుదల కానుంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ది ఘోస్ట్ చేశాక తిరిగి అదే జానర్ లో బలంగా కంబ్యాక్ ఇవ్వాలని ఈసారి అంతకు మించిన పెద్ద స్కేల్ ని తీసుకున్నాడు. ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా గ్రాండ్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తాలూకు కథాకమామీషు రెండు నిమిషాల వీడియోలో చెప్పారు.

భారతదేశాన్ని ప్రమాదం అంచుల్లో నిలబెట్టే ఒక ప్రమాదకరమైన ముప్పు శత్రు దేశంలో పొంచి ఉందని గుర్తించిన ఆదిత్యరాజ్(నాజర్) దాన్ని చేధించే బాధ్యతను అర్జున్(వరుణ్ తేజ్) చేతుల్లో పెడతాడు. తప్పు చేసినా, ఇండియాకు ఎవరు ద్రోహం చేయాలని చూసినా ముందు వెనుకా చూడకుండా ప్రాణాలు తీసే అర్జున్ తాను ఎంత ప్రమాదకర వలయంలో అడుగు పెట్టాడో తెలుసుకుంటాడు. దీని వెనుక ఉన్న కింగ్ పిన్(వినయ్ వర్మ)దాకా ఎలా వెళ్ళాడు, పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడు, దీనికి ప్రియురాలి(సాక్షి వైద్య)కి ఉన్న కనెక్షన్ ఏంటనేది సినిమాలో చూడాలి.

విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువల్లో రాజీ కనిపించలేదు. ప్రవీణ్ సత్తారు టేకింగ్ లో స్టాండర్డ్ కనిపిస్తోంది. స్టోరీ లైన్ చెప్పినట్టే అనిపించినా ఇంకా బోలెడు ట్విస్టులు సస్పెన్స్ లో పెట్టేశారు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయ్యింది. విమలా రామన్, రోహిణి. మనీష్ చౌదరి, అభినవ్ గోమటం తదితరులు ఇతర కీలక తారాగణం. ఈ ఏడాది స్పై బ్యాక్ డ్రాప్ లో ఏజెంట్, స్పైలు వచ్చాయి. కానీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. గాండీవధారి అర్జున ఈ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా ఉంది. పెదనాన్న వచ్చిన రెండు వారాలకు అబ్బాయి దిగుతున్నాడు.