జాతిరత్నాలు భామకు జంగబురు కలిసొచ్చిందా  

ఒక్కోసారి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పడినా కొందరు హీరోయిన్లకు టైం పెద్దగా కలిసి రాదు. జాతిరత్నాలుతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఫరియా అబ్దుల్లాకు అట్టే అవకాశాలు కలిసి రాలేదు. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినా లాభం లేకపోయింది. రావణాసురలో సపోర్టింగ్ ఆర్టిస్టు శ్రీరామ్ కు భార్యగా నటించడానికి కూడా వెనుకాడలేదు. ఎన్ని చేసినా బ్రేక్ దక్కలేదు. అయితే ఓ మంచి వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేసింది. అదే జంగబూరు కర్స్. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ సీరియస్ డ్రామా మీద ట్రైలర్ చూశాక అంచనాలు మొదలయ్యాయి

లండన్ లో ఫైనాన్షియల్ అనలిస్టుగా పని చేస్తున్న ప్రియా దాస్(ఫరియా అబ్దుల్లా)కు ఇండియా నుంచి ఫోన్ వస్తుంది. తండ్రిని నక్సలైట్లు కిడ్నాప్ చేశారని చెబుతారు. వెంటనే వచ్చిన ప్రియా తమ స్వంత ఊరు జంగబూరులో నెలకొన్న దారుణమైన పరిస్థితులకు, స్వతంత్ర దాస్ మాయం కావడానికి లింక్ ఉందని అర్థం చేసుకుని ఆ కోణంలో నిజాలు వెలికి తీసేందుకు పూనుకుంటుంది. అయితే మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్న ఆ ప్రాంతంలో ఆమెకు కఠిన పరిస్థితులు ఎదురై ప్రమాదకర వలయంలో చిక్కుకుంటుంది. చివరికి తన గమ్యాన్ని చేరుకుందా లేదానేది తెరమీద చూడాలి.

క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుం ఛాయల్లో సాగే జంగబూరు కర్స్ లో మంచి సీరియస్ పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని దర్శకులు నిల మదబ్ పండా తెరకెక్కించిన తీరు మరీ నెమ్మదిగా ఉండటంతో  నెరేషన్ కొంచెం బోరింగ్ గా సాగుతుంది. పాత్రల్లో నిజాయితీ, క్యారెక్టరైజేషన్లు మలచిన విధానం బాగున్నప్పటికీ ఇలాంటి వాటికి కావాల్సిన డ్రామాని ఆసక్తికరంగా రాసుకోలేకపోయారు. ఫరియా అబ్దుల్లా తన పరిధి మేరకు ఎలాంటి లోపం లేకుండా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా దాన్ని సరైన రీతిలో వాడుకునే ప్లాట్ కుదరలేదు. నటనకు ప్రశంసలు వస్తాయి కాబట్టి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.