ఫ్లాపుల గురించి నిర్మొహమాటంగా చెప్పేశాడు

విజయ్ దేవరకొండకు ఖుషి మీద మాములు నమ్మకం లేదు. గీత గోవిందం టైంలో వచ్చి ఆ తర్వాత పక్కకెళ్ళిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ ని తిరిగి దగ్గర చేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దానికి తగ్గట్టే మైత్రి మూవీ మేకర్స్ ఇది ఎంత లవ్ ఎంటర్ టైనరైనప్పటికీ ప్రమోషన్ల విషయంలో చాలా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా మీడియాని ప్రత్యేకంగా ఆహ్వానించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం దానికి ఉదాహరణ. తిరిగి ఆగస్ట్ 15న ఒక గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్ ని ప్లాన్ చేయబోతున్నారు. అంచనాల నిర్మాణంలో ఇవన్నీ బాగా ఉపయోగపడబోతున్నాయి.

చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ మీడియా ముందుకు వచ్చాడు. లైగర్ తర్వాత ఎక్కడా మైకులకు దొరకలేదు. దీంతో సహజంగానే ఆ డిజాస్టర్ ప్రస్తావన వస్తుంది. అయితే తప్పించుకునే ప్రయత్నం, కప్పి పుచ్చుకోవడం కానీ ఏమీ చేయలేదు. అంచనాలకు తగ్గట్టు లైగర్ ఆడలేదనే మాట వాస్తవమేనని, తాను అంతకు ముందు పరాజయాలు చూశాను ఇకపై కూడా హిట్లు ఫ్లాపులు చూస్తానని చాలా స్పష్టంగా చెప్పి మెచ్యూరిటీని ప్రదర్శించాడు. అంటే ఏ హీరో అయినా సరే రెండు వస్తాయి కాబట్టి అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలనే అర్థంలో చెప్పడం ఆకట్టుకుంది.

ఇదే ప్రెస్ మీట్ లో కన్నడ, హిందీ, తమిళ ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు బాష అర్థం కాక విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణలు ఇబ్బంది పడటం అందరినీ నవ్వించింది. తొలుత ఖుషిని ప్యాన్ ఇండియా ఎందుకనుకున్నామని, అయితే కథలో ఉన్న సోల్ అందరికీ కనెక్ట్ అవుతుందనే ఉద్దేశం తప్ప ఏదో క్యాష్ చేసుకోవాలని కాదని క్లారిటీ ఇవ్వడం బాగుంది. ప్రకృతి చికిత్స కోసం సమంతా అందుబాటులో లేకపోవడంతో సమావేశం మొత్తం హీరో దర్శకుడు నిర్మాతలతోనే జరిగిపోయింది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఖుషికి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఆకర్షణగా నిలుస్తోంది.