‘భోళా శంకర్’ వెనుక ట్విస్టులే ట్విస్టులు

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదొక సగటు మాస్ మసాలా మూవీనే కానీ.. ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. అసలీ సినిమాను చిరంజీవి చేయాల్సింది కాదు. అజిత్ హీరోగా ‘శౌర్యం’ శివ రూపొందించిన ‘వేదాళం’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రం 2015లో విడుదల కాగా.. తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులో ‘ఆవేశం’ పేరుతో డబ్ చేసి రిలీజ్‌కు రెడీ చేశారు. ఒరిజినల్లో సూపర్ హిట్టయిన ఆలుమా డోలుమా పాటను తెలుగులో రిలీజ్ చేశారు కూడా. కానీ అనూహ్యంగా తర్వాత డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌‌ను ఆపేశారు. ఆపై కొన్నేళ్లకు పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. తమిళ దర్శకుడు నీసన్ డైరెక్షన్లో ఎ.ఎం.రత్నం ఈ సినిమాను మొదలుపెట్టాడు. 

ఐతే ముహూర్త కార్యక్రమం జరిగాక అనూహ్య పరిణామాల మధ్య ఈ సినిమా ఆగిపోయింది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్టు కూడా రెడీ చేశాక దాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ‘వేదాళం’ రీమేక్ గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి. చివరికి ఈ సినిమా చిరు చేతుల్లోకి వచ్చింది. ముందు ఆయన వేరే దర్శకుల పేర్లను పరిశీలించారు.

కానీ కరోనా టైంలో తాను చేపట్టిన సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించిన తన బంధువు మెహర్ రమేష్‌కు తన వంతుగా ఏదైనా చేయాలనిపించి ఈ ప్రాజెక్టును తన చేతికి అప్పగించాడు. అనిల్ సుంకరతో పాటు తనకు బాగా క్లోజ్ అయిన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావును ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశారు. కొన్ని కారణాల వల్ల తర్వాత రామారావు ఈ సినిమా నుంచి బయటికి వెళ్లారు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కొంచెం ఆలస్యం జరిగింది. షూటింగ్ కూడా ఆలస్యమైంది. ఏప్రిల్లోనే రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించబోతోంది.