మంచి పాటలు చచ్చిపోతున్నాయి – మణిశర్మ 

ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసేవారు. శ్రోతలు ఆ క్యాసెట్స్ కొనుగోలు చేసి అన్నీ పాటలు వినే వారు. ఇంట్లోనో , కారులోనో అన్నీ పాటలు ప్లే చేస్తూ ఆస్వాదించే వారు. కానీ నేటి రోజుల్లో ఒక్కో పాటను లిరికల్ అంటూ రిలీజ్ చేస్తుండటంతో కొన్ని మిగతా మంచి పాటలు చచ్చిపోతున్నాయంటూ మణిశర్మ తన ఆవేదన బయటపెట్టాడు. 

కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘బెదురులంక 2012’  అనే సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఆ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మణిశర్మతో హీరో , దర్శకుడు కలిసి ఓ చిట్ చాట్ చేశారు. అందులో మణిశర్మ తన ఆవేదన చెప్పుకున్నారు. హీరో కార్తికేయ ఒకప్పుడు సాంగ్స్ రిలీజ్ గురించి , ఆడియో క్యాసెట్స్ గురించి చెప్తుండగా.. మధ్యలో మణిశర్మ అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం తెలిపారు. 

“కొన్ని పాటలు వినగానే నచ్చేస్తాయి. ఇంకొన్ని ఐదు సార్లు వింటే ఎక్కుతాయి. మరికొన్ని ఎక్కువ సార్లు వింటే నరనరాల్లోకి వెళ్లిపోతాయి. కానీ ఇప్పుడు అలా వినే లేదు. ఏది నచ్చిందో అదే వింటున్నారు. మిగతా పాటలు మళ్ళీ మళ్ళీ వినడం లేదు. అందువల్ల కొన్ని మిగతా మంచి పాటలు చచ్చిపోతున్నాయి.  అంతే కాదు ఇప్పుడు బెస్ట్ ఆఫ్ మణిశర్మ , బెస్ట్ ఆఫ్ దేవి అంటూ కొన్నే పాటలు పెడుతున్నారు. దాని వల్ల మిగతా పాటలు వినలేకపోతున్నారు.” చివర్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అన్నట్టుగా దండం పెట్టేశారు మణిశర్మ. 

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేది కరెక్టే. కానీ ఇప్పుడు నచ్చిన పాటలు మాత్రమే వినే సౌకర్యం వచ్చేసింది. దీంతో మిగతా పాటలు మళ్ళీ మళ్ళీ వినే పరిస్థితి అయితే లేదు. కాలంతో పాటే వచ్చిన ఈ మార్పును ఎంత గింజుకున్నా ఏం చేయలేం. ఈ విషయం మణిశర్మకి కూడా తెలుసు. అందుకే ఇంటర్వ్యూలో మాత్రమే ఇలా తన ఆవేదన వ్యక్తపరిచారు. మార్పు రాదని ఆయనకి తెలియనిది కాదు.