లియో కథలో సీక్వెల్ ట్విస్టు

బాహుబలి, కెజిఎఫ్ పుణ్యమాని సీక్వెల్ ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిపోయిన తర్వాత అందరూ అదే బాట పడుతున్నారు. పుష్పకు ఇది ఎంత బాగా కలిసి వచ్చిందంటే సెకండ్ పార్ట్ కోసం నార్త్ ఆడియన్స్ ఎగబడేంతగా. క్రేజీ కాంబోలు, వందల కోట్ల బడ్జెట్ లు ఉంటే చాలు ఖచ్చితంగా కొనసాగింపు ఉండేలా దర్శక రచయితలు ప్లాన్ చేసుకుంటున్నారు. దీని వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో డబుల్ బిజినెస్ తో పాటు రెట్టింపు లాభాలు అందుకోవచ్చు. అందుకే సలార్ సైతం ఇదే బాట పట్టేసి ఏకంగా రెండు వేల కోట్లను టార్గెట్ చేసుకుందన్న మాట వాస్తవం.

ఇప్పుడీ ఫీవర్ విజయ్ కు పాకిపోయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియోని రెండు భాగాల్లో రూపొందిస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. తొలుత ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలనుకున్నప్పటికీ పలు వర్గాల ద్వారా లీకైపోవడంతో ఏ క్షణమైనా అఫీషియల్ చేసే అవకాశాలున్నాయి. వచ్చే అక్టోబర్ 20న విడుదల కాబోతున్న లియోకు బిజినెస్ పరంగా చాలా క్రేజ్ నెలకొంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లకు కొనడం ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూశాం. ఇప్పుడీ ఫిగర్ రెండు పార్ట్స్ కి కలిపా లేక విడిగానా అనేది తెలియాల్సి ఉంది.

విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. ఇతని గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ లతో లింక్ కలిసేలా కథాకథనాలు ఉంటాయనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో రెండు నెలలకు పైగా ఎదురు చూడాలి. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఆడియో నుంచి రిలీజైన ఒక సాంగ్ భీభత్సంగా కాదు కానీ జనానికి బాగానే ఎక్కేసింది. విజయ్ నటిస్తున్న మొట్టమొదటి టూ పార్ట్ మూవీ ఇదే అవుతుంది. హీరోయిన్ త్రిష, విలన్ సంజయ్ దత్ లాంటి ఆకర్షణలు లియోలో బోలెడున్నాయి . భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులతో క్లాష్ కు సిద్ధమవుతోంది.