వీరయ్య హితబోధ ఏపి సర్కారుకేనా

టికెట్ రేట్లు, అదనపు షోల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల సినీ పరిశ్రమ ఎంత అసంతృప్తిగా ఉందో దాచి పెట్టేది కాదు. బాహాటంగా ఎవరూ బయటికి చెప్పకపోయినా ఇండస్ట్రీ పెద్దలు కలుసుకున్నప్పుడు దీని గురించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఆ మధ్య చిరంజీవి టాలీవుడ్ స్టార్ హీరోలను వెంటతీసుకెళ్లి జగన్ కు నమస్కారం పెట్టి మరీ సమస్యల పరిష్కారానికి విన్నవించుకోవడం మర్చిపోయేది కాదు. అయితే ఏపీ సర్కారు ధోరణి గురించి ఏనాడూ పెద్దగా ఓపెన్ గా మాట్లాడని మెగాస్టార్ మూడు రోజుల్లో భోళా శంకర్ రిలీజ్ ఉండగా ఇన్ డైరెక్టర్ గా హితబోధ చేశారు.

నిన్న సాయంత్రం వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుక జరిగింది. మీడియా, అభిమానులు ఎవరూ లేకుండా కేవలం టీమ్ మెంబర్స్ మాత్రమే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గవర్నమెంట్ లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల పూర్తి, యువతకు ఉద్యోగాలు తదితర అంశాల మీద దృష్టి పెట్టాలి తప్పించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమాల మీద కాదని అన్నారు. తెలంగాణ వైపు నుంచి ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ అందులోనూ పవన్ కళ్యాణ్ రిలీజులున్నప్పుడు ఎక్కువ ఈ సమస్య రిపీట్ అవుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమను పల్లెత్తు మాట అన్నా ఊరుకొని వైసిపి గణం ఇప్పుడు ఊరికే ఉంటుందా లేక మళ్ళీ తమ్ముడిని టార్గెట్ చేసుకుని అన్నయ్యని తూలనాడతారా అనేది వేచి చూడాలి. అయినా హఠాత్తుగా చిరు ఈ విషయాల గురించి మాట్లాడ్డం చూసి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. వాల్తేరు వీరయ్య విశేషాల గురించి చెబుతారనుకుంటే అనూహ్యంగా ఇలా పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేయడం షాక్ ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు కోసం భోళా శంకర్ అప్లికేషన్ పెట్టిన టైంలో ఇలా జరగడం ఏ పరిణామాలకు దారి తీస్తుందో.