హఠాత్తుగా ట్రెండ్ అవుతున్న గేమ్ ఛేంజర్

ఎప్పుడో టైటిల్ పెట్టినా ఇంకా RC 15గానే ఎక్కువ చెలామణిలో ఉన్న గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదని రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు టీమ్ మీద మహా కోపంగా ఉన్నారు. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్నా ఇప్పటికీ విడుదల తేదీ మీద క్లారిటీ రాకపోవడం పట్ల వాళ్ళ ఆగ్రహం సరైనదే . అయితే హఠాత్తుగా ఇప్పుడీ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్చిలో విడుదల చేసేలా టీమ్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాదు మరికొన్ని విశేషాలు కూడా ఫ్యాన్స్ మధ్య చక్కర్లు కొడుతున్నాయి.

వాటిలో ప్రధానమైంది కేవలం పాటల కోసమే దర్శకుడు 90 కోట్లు ఖర్చు పెట్టించాడనే టాక్. మాములుగా ఈ బడ్జెట్ తో మీడియం రేంజ్ స్టార్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీనే తీయొచ్చు. అలాంటిది సాంగ్స్ కోసం ఇంత డబ్బంటే ఎవరికైనా షాక్ కొట్టక మానదు. క్లైమాక్స్ లో 500 మంది పాల్గొన్న ఫైట్ ఎపిసోడ్ చరణ్ బెస్ట్ ఇంట్రోస్ లో మొదటగా చెప్పుకునే ఆర్ఆర్ఆర్ ని మించి ఉంటుందనే మరో లీక్ ఆసక్తికరంగా ఉంది.వీటికి తోడు కియారా అద్వానీ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ ఎంతగా ఊహించుకున్నా సరే అంతకు రెట్టింపు స్థాయిలో థ్రిల్ ఇస్తుందని తెగ ఊరించేసింది.

ఇవన్నీ ఒకరకంగా ఎస్విసి సంస్థకు ప్లస్ అయ్యేవే. తాముగా పబ్లిసిటీ చేయకపోయినా ఏదో రూపంలో జనం నోళ్ళలో నానుతూ ఉంటే అసలు ప్రమోషన్ మొదలుపెట్టే నాటికి హైప్ వచ్చేసి ఉంటుంది. ఇండియన్ 2 కోసం దీని షూట్ ఆలస్యం చేస్తూ వచ్చిన శంకర్ ఈ డిసెంబర్ లోగానే గుమ్మడికాయ కొడతానని చరణ్ కు హామీ ఇచ్చాడట. అయితే ఎంత వరకు నెరవేరుస్తారో నమ్మకంగా చెప్పలేం. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ తండ్రి కొడుకులుగా రెండు గెటప్స్ లో కనిపిస్తాడు. పాటలు డబుల్ ట్రిపుల్ ఎక్స్ ఎల్  లో ఉంటాయని తమన్ చెప్పడం ఆల్రెడీ వైరల్ టాపిక్ అయ్యింది.