డబ్బింగ్ సినిమాలకు మతిపోయే రేట్లు

టాలీవుడ్లో మళ్ళీ డబ్బింగ్ సినిమాల హవా ఊపందుకుంది. కొన్నేళ్లు డల్ గా నడిచిన ఈ మార్కెట్ కెజిఎఫ్, కాంతారలతో అనూహ్యంగా ఊపందుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాంతీయ భేదాలు చూపించకుండా అందరినీ ఆదరించేది ఒక్క తెలుగు ప్రేక్షకులేననే అంశం నిర్మాతలకు కామధేనువుగా మారింది ఇటీవలే విజయ్ లియోని సితారా ఎంటర్ టైన్మెంట్స్ తమ మొదటి డిస్ట్రిబ్యూషన్ వెంచర్ గా 21 కోట్లకు కొనుగోలు చేసిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుల పోటీ ఉందని తెలిసినా కూడా ఇంత మొత్తానికి సిద్ధపడ్డారు.

తాజాగా షారుఖ్ ఖాన్ జవాన్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని 23 కోట్ల దాకా రెడ్ చిల్లీస్ సంస్థ కోట్ చేసినట్టు తెలిసింది. ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు కానీ ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. పఠాన్ ఏపీ తెలంగాణలో యాభై కోట్ల గ్రాస్ దాకా వసూలు చేసిన నేపథ్యంలో అంతకు మించిన కంటెంట్ ఉన్న జవాన్ కు ఇది సరైన ధరని ఫీలవుతున్నారట. మరోవైపు లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చంద్రముఖి 2కి సైతం ఇదే రేంజ్ లో మతిపోయే రేట్లు చెబుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినపడుతోంది. హీరో మార్కెట్ కాకుండా టైటిల్ కున్న బ్రాండ్ మీద అమ్మాలని చూస్తున్నారట.

జైలర్ కూడా స్వంతంగా రిలీజ్ చేయాలా లేక బడా ప్రొడ్యూసర్ కు ఇవ్వాలనే సమాలోచనలో సన్ పిక్చర్స్ సీరియస్ గా ఉంది. ఇంకో వారం పది రోజుల్లో ఇవన్నీ ఫైనల్ అయిపోతాయి. ఎంత అనువాద మార్కెట్ పుంజుకున్నట్టు కనిపిస్తున్నా డిజాస్టర్లు కూడా పడుతున్నాయి. విజయ్ ఆంటోనీ హత్య, శివ కార్తికేయన్ మహావీరుడు, లారెన్స్ రుద్రుడు ఇవన్నీ బ్రేక్ ఈవెన్ అందుకోలేక చేతులు ఎత్తేసినవే. అంతా బాగానే ఉంది కానీ వీటి వల్ల మన స్ట్రెయిట్ సినిమాలకు థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. ఇక్కడ వ్యాపారమే ప్రధానమైనప్పుడు దీన్ని ఎవరు పట్టించుకుంటారు.