నాగ్ అశ్విన్.. భలే పని చేస్తున్నాడు

ఆత్మ విమర్శ లేకుండా ఈ పనీ విజయవంతం కాదు. మనం అంతా బాగా చేస్తున్నాం అని ఎవరికి వాళ్లు మురిసిపోతే బెస్ట్ ఔట్ పుట్ బయటికి రాదు. ఏ పని చేస్తున్నా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం.. తప్పులు దిద్దుకోవడం చాలా అవసరమైన విషయాలు. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను రూపొందిస్తున్న దర్శకుడతను.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమా క్వాలిటీపై సందేహాలు రేకెత్తించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన టీజర్ మాత్రం అదిరిపోయే స్పందన తెచ్చుకుంది. సినిమాకు మళ్లీ హైప్ తీసుకొచ్చింది. ఆ టీజర్ చూస్తే హాలీవుడ్ సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలిగింది.

టీజర్‌కు అంత మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదు. టీజర్లో చూపించిన షాట్స్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌పై అతను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమీక్షల మీద సమీక్ష చేపట్టాడు. దీని మీద తన టీంతో కలిసి పని చేస్తున్న ఫొటోను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన టీం సరైన దారిలోనే వెళ్తోందా.. లేక ఏవైనా లోటు పాట్లు ఉన్నాయా అన్నది టీజర్ రివ్యూలను బట్టి ఒక అంచనాకు వచ్చి, అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాలన్నది నాగ్ అశ్విన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇలా మేకింగ్ దశలోనే జాగ్రత్త పడితే.. రిలీజ్ తర్వాత ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలకు వచ్చిన నెగెటివిటీని ఎదుర్కోవాల్సిన పని ఉండదు. నాగి జాగ్రత్త చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ‘కల్కి 2898 ఏడీ’ తేడా కొట్టే అవకాశమే ఉండదన్న భరోసా ప్రభాస్ అభిమానుల్లో కలుగుతోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఇందులో కమల్ హాసన్ కూడా పాల్గొనబోతున్నాడు.