ఒక నిర్మాత‌గా సిగ్గు ప‌డుతున్నా: భ‌ర‌ద్వాజ

సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తాజాగా నిప్పులు చెరిగారు. త‌ర‌చుగా ఆయ‌న సినీ రంగంపై విమ‌ర్శ‌లు సంధిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా జ‌రిగిన టాలీవుడ్ వాణిజ్య మండ‌లి ఎన్నిక‌ల‌పై రియాక్ట్ అవుతూ.. “ఒక నిర్మాత‌గా నేను సిగ్గు ప‌డుతున్నా!” అని వ్యాఖ్యానించారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కుచెందిన వాణిజ్య మండ‌లి ఎన్నిక‌లు ఆదివారం జ‌రిగాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఎన్నిక‌లు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత‌లు.. దిల్ రాజు, సీ. క‌ళ్యాణ్ ప్యాన‌ల్స్ హోరా హోరీ త‌ల‌ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాలు కూడా జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో నాయ‌కులు ఇచ్చే హామీల మాదిరిగా హామీల వ‌ర‌ద పారించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని ఒక‌రు అంటే.. ప్ర‌భుత్వాల నుంచి స‌మ‌స్య‌లురాకుండా.. చ‌ర్చిస్తామ‌ని ఇంకొక‌రు హామీలు ఇచ్చారు. దీనిపై స్పందించిన త‌మ్మారెడ్డి.. “ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్‌ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్‌ ఎలెక్షన్స్‌లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదు” అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.

‘నేను కూడా చాలా ఎలెక్షన్స్‌ చూశాను. ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి ఎన్నిక‌ల వాతావరణం ఎప్పుడూ చూడ‌ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్‌ కాంపెయిన్‌ చూస్తుంటే భయమేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు.

కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్‌ వాడివేడిగా జరిగింది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో ఉన్న దిల్‌ రాజు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న‌పై హోరాహోరీగా త‌ల‌ప‌డిన‌ సీ. కల్యాణ్ ప‌రాజ‌యం పాల‌య్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన పోలింగ్ అనంత‌రం.. ఫ‌లితాన్ని వెల్ల‌డించారు. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు.