బేబి కాపీ సినిమా.. దర్శకుడే హింటిచ్చాడు

టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో అతి పెద్ద సెన్సేషన్ అంటే.. బేబి మూవీనే. పెద్దగా పేరు లేని నటీనటులతో దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న సాయిరాజేష్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపింది. రెండు వారాల్లో దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీ జనాలు నోరెళ్లబెట్టేలా చేసింది. వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్‌తో ఈ సినిమా ట్రేడ్ పండితులకు పెద్ద షాకే ఇచ్చింది. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు.

ఐతే ‘బేబి’ కాపీ మూవీ అంటూ ఒక వ్యక్తి ఆరోపిస్తుండటం గమనార్హం. ఐతే ఈ వ్యక్తిని సోషల్ మీడియాకు పరిచయం చేసిందే ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ కావడం ఇక్కడ ట్విస్టు. ‘బేబి’ తన కథను దొంగిలించి తీసిన సినిమా అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన పేరు.. దినేష్ కుమార్ డీకే.

ఒక తమిళ క్రిటిక్ ఇతను పెట్టిన పోస్టును షేర్ చేయగా.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి సాయి రాజేష్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ కొన్ని మీడియా సంస్థలను ట్యాగ్ చేసి దీని మీద వార్తలు రాసుకోమని హింట్ ఇవ్వడం విశేషం. తాను 2012లోనే తన జీవితంలో జరిగిన సంఘటనలు.. తన ప్రేమకథ ఆధారంగా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్రిప్టు రాయడం మొదలుపెట్టానని.. 2018లో బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిందని.. ఆ తర్వాత వివిధ ఇండస్ట్రీలకు సంబంధించిన నిర్మాతలను కలిసి కథ చెప్పానని.. కొందరికి స్క్రిప్ట్ కూడా ఇచ్చానని.. తీరా చూస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ‘బేబి’ పేరుతో తన కథనే సినిమాగా తీశారని ఆ వ్యక్తి ఆరోపించాడు.

ఐతే హిట్ సినిమాల మీద ఇలా కాపీ మరకలు అంటించి పాపులర్ అవ్వాలని చూసేవాళ్లు కూడా ఉంటారు. అలాగే కొన్ని కథలు మనవిలా అనిపించడం కాకతాళీయంగానూ జరుగుతుంది. మరి ఇది ఏ కోవకు చెందిందో చూడాలి. ‘బేబి’ కథకు తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక ఉదంతం స్ఫూర్తి అని ఆ ఇన్సిడెంట్ గురించి కూడా సాయిరాజేష్ ఓపెన్‌గానే చెప్పిన విషయం గమనార్హం.