ప్రతినిధి 2 ఎవరిని ప్రశ్నించబోతున్నాడు

టాలెంట్ పుష్కలంగా ఉంటూ సబ్జెక్ట్ సెలక్షన్ లో ప్రత్యేక శైలిని అనుసరించే నారా రోహిత్ తెరమీద కనిపించి చాలా గ్యాప్ వచ్చేసింది. తనకు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ప్రతినిధి ముందు వరుసలో ఉంటుంది. 2014లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం ద్వారా సమాజంపై సమస్యల వర్షం కురిపించే బాధ్యతాయుతమైన యువకుడి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించగా కమర్షియల్ గానూ బాగా పే చేసింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ప్రతినిధి 2తో నారా రోహిత్ మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

టీవీ 5 మూర్తి దీనికి డైరెక్షన్ చేయనుండటంతో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోయి ఉంది. అధికార పార్టీ  పాలన పట్ల ప్రజలు, ప్రతిపక్షం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎండగట్టేలా ప్రతినిధి 2లో చాలా అంశాలు ఉంటాయని ఇన్ సైడ్ టాక్. చాలా వేగంగా షూటింగ్ చేయబోతున్నారు. 2024 జనవరి 25 విడుదల తేదీ కూడా పోస్టర్ లోనే ఇచ్చేశారు. అంటే ఆరు నెలల లోపే చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సంక్రాంతి లోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారన్న మాట. అంతా ప్లాన్డ్ గా జరుగుతోందని సమాచారం.

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగానే నారా రోహిత్ గళం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సిఎం జగన్  మీద సైటైర్లు, మూడు రాజధానుల వ్యవహారం, ఎమ్మెల్యే మంత్రుల అవినీతి తదితర అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే చిరంజీవి భోళా శంకర్ రూపంలో ప్రమోషన్ అందుకున్న మహతి స్వరసాగర్ దీనికి సంగీతం సమకూర్చబోతున్నాడు. ఎన్నికలు మరికొన్ని నెలల్లో రాబోతుండగా ప్రతినిది 2 రావడం, అది కూడా యాత్ర 2 కన్నా ముందు ప్లాన్ చేసుకోవడం ప్రత్యర్థికి తగిన బాణమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.