సూర్య పుట్టినరోజే ప్రాణాలు కోల్పోయిన అభిమానులు 

సినిమా హీరోల మీద ఎంతైనా అభిమానం, ప్రేమ ఉండొచ్చు కానీ అది ప్రాణాలను పణంగా పెట్టేంత మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు జరిగే కొన్ని సంఘటనలు కన్నవాళ్లకు జీవితాంతం కడుపు కోతను మిగిలిస్తాయి. ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు యువకులు ప్రమాదం బారిన పడి తుది శ్వాస తీసుకోవడం కలచి వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ నరసారావుపేట జిల్లా మోపువారిపాలెంలో నివసించే నక్కా వెంకటేష్ , పోలూరు సాయిసూర్య ఇద్దరూ సూర్య వీర ఫ్యాన్స్. ఇద్దరి వయసు 20 సంవత్సరాల లోపే.

కంగువా టీజర్, పోస్టర్ తమ హీరో బర్త్ డే సందర్భంగా రిలీజ్ కావడంతో ఆ ఆనందాన్ని పంచుకోవటానికి ఒక ఫ్లెక్సీ తయారు చేయించి అందరికీ కనిపించేలా కట్టడం కోసం కరెంటు స్థంభం ఎక్కారు. అయితే ఆ సమయంలో  విద్యుత్ ప్రసరణ జరుగుతోంది. ఈ విషయం తెలియక అనుకోకుండా తీగలను తాకడంతో ఇద్దరూ అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. వీళ్ళంతా పట్టణంలోని డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు.

గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. చిన్న అప్రమత్తత ప్రాణాలు తీస్తుందని తెలిసినా కూడా అవసరం లేని రిస్కు తీసుకుంటున్నారు. మాములుగా ఎవరైనా గాయపడితేనే తల్లడిల్లిపోయే సూర్య ఆపద, అవసరం ఉన్న వాళ్ళ కోసమే అగరం ఫౌండేషన్ నడిపిస్తున్నాడు. అలాంటిది తన పుట్టినరోజు నాడు అమాయకులైన ఇద్దరు కుర్రాళ్ళు అసువులు బాయడం ఎంత బాధిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ఫ్యానిజం పేరిట కార్యక్రమాలు చేయొచ్చు కానీ ప్రమాదాలతో మాత్రం ఆడుకోకూడదు.