మెగా అభిమానులకు అర్థమవుతోందా?

సోషల్ మీడియాలో మెగా అభిమానుల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ అభిమానులే రెండు వర్గాలుగా విడిపోయి తెగ కొట్టేసుకుంటున్నారు. అందులో ఓ వర్గం చిరు వైపుంటే.. ఇంకో వర్గం పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. చక్కటి అనుబంధంతో సాగిపోతూ ఉంటే.. అభిమానులు ఇలా కొట్టేసుకోవడం విడ్డూరంగా అనిపించకమానదు. ఇంతకీ ఈ గొడవ ఎలా మొదలైందంటే.. జనసేన అధికార ప్రతినిధుల్లో ఒకరైన రాయపాటి అరుణ అనే వీరమహిళ ఒక టీవీ ఛానెల్ చర్చలో మాట్లాడుతూ.. చిరంజీవి గురించి కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. చిరు పార్టీని కొనసాగించి ఉంటే.. ఆయన నిర్ణయాత్మక శక్తి అయ్యేవారని.. ఆయన వెళ్లిపోవడంతోనే జగన్ అనే నాయకుడు వచ్చి ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారాడని.. ఇక చిరు చేసిన పని పవన్ కు ప్రతికూలంగా మారిందని.. రాజకీయంగా పవన్ కు ఆయన ఫెయిల్యూర్ పాథ్ వేశాడని ఆమె పేర్కొంది. ఐతే చిరు గురించి ఇదే చర్చలో అరుణ చాలా పాజిటివ్ విషయాలు కూడా మాట్లాడింది.

గతంలోనూ ఎన్నోసార్లు చిరును కొనియాడింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె చిరును విమర్శించడం మీదే మెగా అభిమానుల్లో ఒక వర్గం ఫైర్ అయిపోయారు. పవన్ మీద, జనసేన మీద విమర్శలు చేస్తూ.. ఆ పార్టీని డిస్ ఓన్ చేసుకుంటున్నట్లు పోస్టులు పెట్టారు. దీని మీద పవన్ అభిమానులు కూడా అంతే తీవ్రంగా స్పందించారు. జగన్ ముందు చిరు చేతులు జోడించినపుడు మీకెవరికీ బాధ అనిపించలేదని.. అరుణ మాటల్లో కొంత వాస్తవం ఉంది కదా అని వాదించారు.

ఒకవేళ ఆమె తప్పు మాట్లాడినా.. దాన్ని మొత్తం పార్టీకి ఆపాదించి జనసేనకు ఓటు వేయమనడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఐతే వైసీపీ మీద పోరాడాల్సింది పోయి.. మెగా అభిమానుల్లో వాళ్లకు వాళ్లు గొడవ పడటం న్యూట్రల్ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి అరుణ మాట్లాడింది ఇప్పటి వీడియోకాదు అనే విషయం లేటుగా వెల్లడైంది. అది ఏడు నెలల కిందటిదట. దీన్ని బట్టే ఇది ఎవరో పనిగట్టుకుని రేపిన చిచ్చు అనే విషయం ఈజీగా అర్థమైపోతోంది. ఒంగోలులో ఎన్టీఆర్ పేరుతో నారా లోకేష్ ను కించపరిచేలా ఫ్లెక్సీలు పెట్టి తారక్, తెలుగుదేశం వర్గాల మధ్య చిచ్చు పెట్టిన వైసీపీ వాళ్లే దీని వెనుకా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది అర్థం చేసుకోకుండా మెగా అభిమానులు మాత్రం తెగ కొట్టేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.