‘బేబి’ ఫస్ట్ కాపీ చూసి దర్శకుడి భయం

ప్రస్తుతం టాలీవుడ్లో ‘బేబి’ అనే చిన్న సినిమా గురించే డిస్కషన్ అంతా. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లను పెట్టి దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవం ఉన్న సాయి రాజేష్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతోంది. ముందు రోజు ప్రిమియర్స్ నుంచే హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం.. తొలి రోజు కూడా థియేటర్లను జనంతో నింపేసింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరే.. యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్‌లో సైతం మంచి వసూళ్లు సాధిస్తోందీ చిత్రం. తొలి రోజు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. వీకెండ్ అంతా ‘బేబి’ దూకుడు కొనసాగేలాగే కనిపిస్తోంది. యూత్ ఇంతగా కనెక్ట్ అయిన ఈ చిత్రం విషయంలో విడుదలకు ముందు దర్శకుడిగా కాన్ఫిడెన్స్ లేదట. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అతను భయపడ్డాడట.

‘బేబి’ థ్యాంక్స్ మీట్లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ సినిమా స్క్రిప్టు రాసేటపుడైనా.. పొద్దు పొద్దునే సినిమా చూసే ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తా. తెల్లవారుజామున 4 గంటలకు.. మిడ్ నైట్ 12 గంటలకు స్పెషల్ షోలు చూడటం అలవాటైన వాడిని. అప్పుడు చూసే ప్రేక్షకులకు నిద్ర వస్తుంటుంది. కొందరు తాగి వస్తారు. ఆ మూడ్‌లో సినిమా చూసినపుడు ఎక్కడ కొంచెం స్లో అయినా నెగెటివ్ రియాక్షన్ వస్తుంది. అందుకే సినిమా వేగంగా సాగిపోవాలన్న ఆలోచనతో స్క్రిప్టు రాస్తుంటా.

ఐతే ‘బేబి’ విషయంలో మాత్రం కొంచెం ఆగి చెప్పాల్సిన కథలా అనిపించింది. ఈ కథతో నేను ప్రేమలో పడిపోయాను. నేను తీసిన సినిమా నాకు బాగా నచ్చేసింది. కానీ రష్ చూసుకున్నపుడు సినిమా కొంచెం స్లోగా ఉండటంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయమేసింది. నిర్మాత ఎస్కేఎన్‌తో ఒకటే మాట చెప్పాను.

కావాలంటే వేరే హిట్ సినిమా తీసి ఇస్తాను.. కానీ ఈ సినిమాను మాత్రం ఇలాగే ఉండనిద్దాం అని చెప్పాను. ఆడియన్స్ నా అంచనాలకు భిన్నంగా ఈ సినిమాను రిసీవ్ చేసుకున్నారు. సంధ్య థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. అక్కడక్కడా బాధ పడుతూనే.. మళ్లీ ఒక జోష్ ఉన్న సీన్ పడితే చప్పట్లు కొట్టారు. సినిమా అయ్యాక కూడా చప్పట్లు కొనసాగాయి. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు రుణపడి ఉంటాను. మీడియా వాళ్లకు కూడా నా కృతజ్ఞతలు’’ అని తెలిపాడు.