రంగస్థలం దెబ్బకు కుదేలైన కెజిఎఫ్

ఆర్ఆర్ఆర్ పుణ్యమాని జపాన్ లో సౌత్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. కంటెంట్ పరంగా మన ఎమోషన్లకు వాళ్ళు బాగా కనెక్టవుతున్నారు. తాజాగా కెజిఎఫ్ రెండు భాగాలు, రంగస్థలం అక్కడ ఒకేసారి మొన్న శుక్రవారం రిలీజ్ చేశారు. అయితే రాఖీ భాయ్ గా యష్ విశ్వరూపం కన్నా చిట్టిబాబుగా రామ్ చరణ్ నటనని ఎంజాయ్ చేసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ట్రిపులార్ ని దాటిన మూవీగా కెజిఎఫ్ నిర్మాతలు పోస్టర్లలో ఆ విషయాన్ని హైలైట్ చేసినప్పటికీ ప్రమోషన్ పరంగా దాని ప్రభావం పెద్దగా లేదని తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం అది విడుదలైన సమయంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడున్నంతగా ఆ టైంలో ప్యాన్ ఇండియా హడావిడి లేకపోవడంతో నిర్మాతలు ఇతర భాషల్లో డబ్బింగ్ మీద సీరియస్ గా దృష్టి పెట్టలేదు. అందుకే తమిళ కన్నడ వెర్షన్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆర్ఆర్ఆర్ ఎప్పుడైతే జపాన్ లో రచ్చ రచ్చ చేసిందో అప్పటి నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రాలను ఆ దేశంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే రంగస్థలం లేట్ అయినా వర్కౌట్ అవుతోంది.

కలెక్షన్ల ఫిగర్లకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఇంకా రాలేదు కానీ ఆర్ఆర్ఆర్, బాహుబలి, దంగల్ తర్వాత వాటి సరసన నిలబడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . పనిలో పని మగధీర కూడా రీరిలీజ్ చేస్తే దానికీ స్పందన బాగుందట. ఈ లెక్కన రాబోయే రోజుల్లో  జపాన్ మార్కెట్ మనకు బాగా విస్తరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాత సినిమాలైనా ఎలా ఆడుతున్నాయని అనుకుంటున్నారా. అక్కడ ఆన్లైన్ పైరసీ ఉండదు. ఓటిటి కంటెంట్ మీద కఠిన నిబంధనలు, పర్యవేక్షణ ఉంటాయి. కాబట్టి థియేటర్ లేదా అఫీషియల్ డిజిటల్ పార్ట్ నర్ ద్వారా తప్ప ఇంకో మార్గంలో చూసే ఛాన్స్ ఉండదు.