మహాభారతం ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి తండ్రి

తెలుగు వాళ్లే కాదు.. మొత్తం భారతీయ ప్రేక్షకులందరూ రాజమౌళి ‘మహాభారతం’ మీద సినిమా తీస్తే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని దశాబ్దం కిందటే ప్రకటించాడు జక్కన్న. ఆ మెగా మూవీ తీయడానికి అవసరమైన అనుభవాన్ని సంపాదించే క్రమంలో మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ఆయన రూపొందించాడు.

ఈ సినిమాలు చూసిన వాళ్లందరికీ రాజమౌళి ‘మహాభారతం’ను వెండితెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేయగలడని ధీమాతో ఉన్నారు. ఇటీవల రామాయణాన్ని కంగాళీగా మార్చిన ‘ఆదిపురుష్’ సినిమా చూశాక ఇంకెవరూ ఇలాంటి ఎపిక్స్‌ను టచ్ చేయొద్దని.. రాజమౌళికే వదిలేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. రాజమౌళి వయసు 50కి దగ్గరగా ఉంది. ఆయన చెప్పిన స్కేల్‌లో ‘మహాభారతం’ను పూర్తి చేసి అన్ని భాగాలూ రిలీజ్ చేయాలంటే పది పదిహేనేళ్లకు తక్కువ పట్టదు.

కాబట్టి జక్కన్న వీలైనంత త్వరగా ఈ మహా యజ్ఞాన్ని మొదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ ప్రాజెక్టు గురించి ఒక అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద పని చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా అయ్యాక ‘మహాభారతం’ పనులు మొదలవుతాయని విజయేంద్ర వెల్లడించారు.

మహేష్‌తో చేయబోయే సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉంటుందని.. అలాగే ‘ఆర్ఆర్ఆర్-2’ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. మరి ‘ఆర్ఆర్ఆర్-2’ చేస్తే ‘మహాభారతం’ ఎప్పుడు మొదలవ్వాలనే సందేహం రావడం సహజం. ఐతే ఆ ప్రాజెక్టును రాజమౌళే చేయకపోవచ్చని.. ఎవరైనా హాలీవుడ్ డైరెక్టర్ దీన్ని టేకప్ చేయొచ్చని విజయేంద్ర హింట్ ఇవ్వడం విశేషం. కాబట్టి ఇంకో రెండేళ్లలో ‘మహాభారతం’ పనులను రాజమౌళి మొదలుపెట్టేయబోతున్నట్లే.