సెట్ విషయంలో హరీష్ విభేదించారా

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి వారాహి యాత్ర వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. రాజకీయంగా మంచి మైలేజ్ వస్తున్న టైంలో షూటింగుల కోసం మళ్ళీ హైదరాబాద్ వచ్చే ఉద్దేశం లేకపోవడంతో నిర్మాతలు గుంటూరు, విజయవాడ, వైజాగ్ పరిసరాల్లో సెట్లు, అవుట్ డోర్ లో చిత్రీకరణలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓజి, హరిహర వీరమల్లు ఆ పనిలోనే బిజీగా ఉన్నాయి. బ్రో రిలీజ్ కు రెడీ అయ్యింది కాబట్టి టెన్షన్ లేదు. ఈ వారంలోనే హీరో వీలును బట్టి ఆయనున్న చోటికి వెళ్లి డబ్బింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ తెచ్చేసుకుంటారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి హైదరాబాద్ లో ఓ కీలక సెట్ వేసి అందులో ముఖ్యమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు హరీష్ శంకర్. ఖర్చు కూడా భారీగానే జరిగింది. కానీ పవన్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో దాన్ని తీసేసి అచ్చం అలాంటిదే విశాఖపట్నంలో వేద్దామనే ప్రతిపాదన నిర్మాతలు పెడితే దానికి ఆయన నో అన్నారని ఇన్ సైడ్ టాక్. ఎలాగైనా పవన్ ని ఒప్పించి సెట్ దగ్గరికే తీసుకొస్తే వేగంగా షూట్ ని పూర్తి చేసి పంపిస్తానని అంటున్నారట. ఈ విషయంగా వచ్చిన విభేదాల వల్లే ప్రాజెక్ట్ క్యాన్సిలనే పుకార్లు నిన్న మొదలయ్యాయని అర్థమవుతోంది.

నిజంగానే పవన్ కళ్యాణ్ మంచి పొలిటికల్ మూడ్ లో  ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా వారాహికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి షూటింగులకు వెళ్ళిపోతే హీట్ తగ్గిపోతుంది. కానీ తన దర్శకులు మాత్రం ఎప్పుడెప్పుడు సినిమాలు పూర్తి చేద్దామాని ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే బ్రో తర్వాత ఓజి మాత్రమే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అది డిసెంబర్ లేదా జనవరిలో వచ్చినా అక్కడి నుంచి ఎన్నికలకు చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాకే మోక్షం దక్కించుకునేలా ఉంది. ఇక వీరమల్లు గురించి క్రిష్ లేదా రత్నం ఎవరో ఒకరు ఓపెనవ్వాలి తప్ప ఏమీ తెలియడం లేదు.